
- ప్రధాని మోదీకి ఢిల్లీ మంత్రి ఆతిషీ లెటర్
న్యూఢిల్లీ: రెండు రోజుల్లో ఢిల్లీలోని నీటి సంక్షోభాన్ని పరిష్కరించకుంటే జూన్ 21 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ రాష్ట్ర జలవనరుల మంత్రి ఆతిషీ లెటర్ రాశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హర్యానా నీటి వాటాను విడుదల చేయనందున ఢిల్లీ తాగునీటికి ఇబ్బంది పడుతున్నదని అన్నారు. ‘‘నిన్న, హర్యానా ఢిల్లీకి ఇవ్వాల్సిన 613 ఎంజీడీ లకు గాను 513 ఎంజీడీ నీటిని మాత్రమే విడుదల చేసింది.
28,500 మందికి ఒక ఎంజీడీ నీరు. ఈ లెక్కన దాదాపు 28 లక్షల మందికి నీళ్లు విడుదల చేయలేదు’’ అని ఆమె అన్నారు. ఢిల్లీ ప్రజలు వేడిగాలులతో పాటు నీటి కరువుతో కూడా పోరాడుతున్నారని తెలిపారు. నీటి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తాము హర్యానా ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశామని.. అయినా స్పందన లేదని చెప్పారు.
ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా మాట్లాడుతూ నీటి చౌర్యం, బ్లాక్ మార్కెటింగ్ నుంచి దృష్టిని మరల్చడానికి మంత్రి ఆతిషీ డ్రామాలు అడుతున్నారని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం చేతగానితనం వల్లే ఢిల్లీలో ఈ పరిస్థితి వచ్చిందని ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని అన్నారు. హర్యానా నిన్న ఢిల్లీకి మిగులు జలాలను విడుదల చేసిందని నిరూపించడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నారు. అయినా కూడా ఆమె డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు.