
- ఇంజినీరింగ్ సీట్లలో 70 శాతం కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్వే
- సీట్లు పెంచాలని సర్కారును కోరుతున్న మేనేజ్మెంట్లు
- ఏఐసీటీఈ పర్మిషన్ ఇచ్చిన 20 వేల సీట్లూ దాదాపు అవే..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కు తొలిదశ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. దీంట్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులకే ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వైపు స్టూడెంట్స్, వారి పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారు. మూడేండ్ల నుంచి ఇంజినీరింగ్ కోర్ గ్రూపుల్లో పెద్దగా విద్యార్థులు చేరడం లేదు.
దీంతో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్లు సీఎస్ఈ అనుబంధ కోర్సుల సీట్లను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తునాయి.నిరుడితో పోలిస్తే ఈ ఏడాది ఆయా కోర్సుల్లో సీట్లు తగ్గడంతో, ఇటు మేనేజ్మెంట్, కన్వీనర్ కోటా సీట్లకూ ఫుల్ డిమాండ్ మొదలైంది.
9 వేలకు పైగా సీట్లు కన్వర్షన్
బీటెక్ ఫస్టియర్ లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంజినీరింగ్ కాలేజీల్లోని సీట్ల వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 98,296 సీట్లున్నట్టు వెల్లడించారు. వీటిలో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లే 67 వేల దాకా ఉన్నాయి. దీంట్లోనూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లర్నింగ్ (సీఎస్ఎం), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – డేటాసైన్స్ (సీఎస్డీ) బ్రాంచులకు చెందిన సీట్లే 53 వేల వరకూ ఉండడం గమనార్హం.
ప్రస్తుతం స్టూడెంట్లు, పేరెంట్స్ అంతా కంప్యూటర్ సైన్స్ కోర్సుల వైపే మొగ్గు చూపుతుండడంతో ప్రైవేటు కాలేజీలన్నీ ఆ సీట్లను పెంచుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఈ ఏడాది 9 వేలకు పైగా సీట్లను కోర్ బ్రాంచుల నుంచి సీఎస్ఈ అనుబంధ సీట్లకు కన్వర్షన్కు పెట్టుకున్నాయి. అయితే, దీనిపై ఇంకా సర్కారు స్పష్టత ఇవ్వలేదు. మరోపక్క నిరుడితో పోలిస్తే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో సుమారు ఏడు వేల సీట్లు తగ్గాయి. దీంతో ఉన్న సీట్లకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది.
కొత్త సీట్లపైనా ఆశలు
ప్రైవేట్ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈ ఏడాది 20 వేలకు పైగా కొత్త సీట్లకు ఏఐసీటీఈ పర్మిషన్ ఇచ్చింది. దీంట్లో దాదాపు కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించినవే. అయితే, ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా.. సర్కారు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. మరోపక్క కోర్ బ్రాంచుల సీట్లు తగ్గించుకుంటూ.. పూర్తిగా సీఎస్ఈ బ్రాంచుల వైపు మేనేజ్మెంట్లు చూడటంపై సర్కారు పున:పరిశీలిస్తోంది.
మరోపక్క కొత్త సీట్లకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీనిభారం సర్కారుపై పడనున్నది. దీంతో కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్ లో , మరికొన్ని సీట్లకు జనరల్ మోడ్ లో ఇచ్చే ఆలోచన కూడా సర్కారు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానున్నది.
మేనేజ్మెంట్ కోటా సీట్లకు బేరం
ఇంజినీరింగ్ బీ కేటగిరీలోనూ ఏఐ, సీఎస్ఈ సీట్లకు ఫుల్ రెస్పాన్స్ ఉంది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్ రాకముందే, యాజమాన్యాలు ఆయా సీట్లను బేరానికి పెట్టాయి. ఇప్పటికే దాదాపు 70 శాతం సీట్లను అమ్మేశాయి. తక్కువ సీట్లే ఉండడంతో ఒక్కో సీటును రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా డొనే షన్లు తీసుకుంటున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీట్లకు పర్మిషన్ ఇస్తే, డొనేషన్లు తగ్గే అవకాశం ఉంది.