
- మంత్రి పొంగులేటికి మానవతారాయ్ వినతి
ట్యాంక్ బండ్, వెలుగు: రెవెన్యూ విభాగంలో మిగిలిపోయిన 7,404 గ్రామ పాలనాధికారి (జీపీవో) ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయాలని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మానవతారాయ్ డిమాండ్చేశారు. గురువారం నిరుద్యోగులతో కలిసి ఆయన సెక్రటేరియట్కు వెళ్లి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా10,954 గ్రామపాలనాధికారి ఉద్యోగాలుండగా 3,550 ఉద్యోగాలను వీఆర్ఏ, వీఆర్వోలతో భర్తీ చేశారని తెలిపారు. మిగిలిన పోస్టులను నిరుద్యోగులకు ఇస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నిరుద్యోగులు క్రాంతి, మల్లికార్జున్, మహేశ్, రాము, హేమంత్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.