ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి
  • ట్రాన్స్‌‌కోలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ శాఖ ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ప్రజా భవన్‌‌లో జరిగిన కార్యక్రమంలో ట్రాన్స్​కోలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. వీరిలో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు, 11 మంది ఆర్టిజన్‌‌లు ఉన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ట్రాన్స్ కో ఉద్యోగుల కుటుంబాలతో పాటు ఆర్టిజన్‌‌లకు కూడా కారుణ్య నియామకాల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. 

ఆర్టిజన్‌‌లను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందినవారు సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, డైరెక్టర్లు సూర్య ప్రకాష్, బి.నర్సింగరావు, జి.నరసింహారావు, ఎఫ్‌‌ఏ అండ్ సీసీఏ గుప్తా, జాయింట్ సెక్రటరీ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.