
వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా.. కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. పుష్ప 2 సినిమాలోని డైలాగులతో పోస్టర్లు ప్రదర్శించటం వివాదానికి దారి తీసింది. హింసను ప్రేరేపించే విధంగా ఉన్న పోస్టర్లను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేసింది. ప్లకార్డులు ప్రదర్శించినవారిపై కేసులు పెట్టడం సరికాదని ఖండించారు జగన్. ఈ క్రమంలో జగన్ కు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రప రపా డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయని.. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని అన్నారు.
ఎవరైనా చట్టం, నియమనిబంధనలను పాటించాల్సిందేనని అన్నారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందని అన్నారు పవన్. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదని... కచ్చితంగా అలాంటివారిపై రౌడీ షీట్లు తెరిచి... అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని అన్నారు పవన్ కళ్యాణ్.
అశాంతిని, అభద్రతను కలిగించేవారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్నవారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వారిని ఓ కంట కనిపెట్టాలని, చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయకపోగా... వారిని సమర్థించేలా మాట్లాడేవారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలని అన్నారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దని అన్నారు పవన్ కళ్యాణ్.