అమెరికాలో దేశీ ఆవు పిడకల వ్యాపారం

అమెరికాలో దేశీ ఆవు పిడకల వ్యాపారం
  • న్యూజెర్సీలోని కిరాణా స్టోర్స్‌లో అమ్ముతున్నారంటూ ట్వీట్ చేసిన ఓ NRI

నిన్నటి వరకు ఆన్‌లైన్‌లో పిడకల వ్యాపారం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఆవు పేడతో చేసిన పిడకలను అమ్మడం చూసే ఉంటారు. న్యూస్, సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయిన విషయమే ఇది! హోళీ, సంక్రాంతి సహా పలు పండగల టైంలో వీటికి మంచి గిరాకీ కూడా ఉంటోంది.

విదేశాలకు చేరిన దేశీ ఆవు పిడకల వ్యాపారం

ఇప్పుడు లేటెస్టుగా ఆవు పిడకల వ్యాపారం మరో అడుగు ముందుకెళ్లింది. సముద్రాలు దాటి విదేశాలకు చేరిందీ బిజినెస్. అమెరికాలోని గ్రాసరీ (కిరాణా) స్టోర్స్‌లో వీటి సేల్స్ షురూ అయ్యాయి. పది పిడకలకు 2.99 డాలర్ల (సుమారు రూ.215) రేటు కట్టి అమ్ముతున్నారు. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఉన్న ఓ గ్రాసరీ స్టోర్‌లో వీటిని అమ్ముతున్నట్లు సమర్ హలామ్కర్ అనే ఎన్నారై ట్వీట్ చేశాడు. తన కజిన్ వాటి ఫొటోను తనకు పంపాడని తెలిపాడు. అయితే ఆ ప్యాకెట్ చూసిన సమర్‌కు ఓ వింత డౌట్ వచ్చింది. దేశీ ఆవు పేడతో చేసిన పిడకలనే ఇండియా నుంచి దిగుమతి చేశారా? లేక అమెరికా ఆవులతో చేసినవా? అంటూ ట్విట్టర్లో అడిగాడు. దీనిపై చాలా మంది దేశీ అవు పిడకలే అంటూ కామెంట్లు చేశారు. ఓ నెటిజన్ మాత్రం టేస్ట్ చేసి చూడు అంటూ సెటైర్ వేశాడు.

తినేవి కాదంటూ డిస్‌క్లైమర్

ఆవు పేడతో చేసిన పది పిడకల్ని కలిపి ప్యాక్ చేసి అమెరికాలో అమ్ముతున్నారు. వీటి ధర 2.99 డాలర్లుగా పెట్టారు. అయితే ఆ ప్యాకెట్‌పై ఓ ఇంట్రెస్టింగ్ డిస్‌క్లైమర్ కనిపించింది. ‘కౌ డంగ్ కేక్స్.. తినడానికి కాదు. ఇవి పండుగలు పబ్బాల్లో సంప్రదాయ అవసరాల్లో పనికొచ్చేవి’ అని ఆ ప్యాక్‌పై రాసి ఉంది. అంతే కాదు ఎన్నారై సమర్‌లాగా జనాలకు డౌట్ రావచ్చని  ఇండియా నుంచి వచ్చిన ప్రాడక్ట్ అని తెలుపుతూ “Product of India” అని దానిపై ప్రింట్ చేసి ఉంది.