- 68.90 లక్షల మందికి రైతు భరోసా
- 57.45 లక్షల ఎకరాలకు అందనున్న సాయం
- రూ.3,446.94 కోట్ల నిధులు విడుదల నేడు ఖాతాల్లో జమ
- మరో 45 రోజుల్లో రెండు విడుతల్లో మిగతా నిధులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎకరం వరకు భూములు ఉన్న రైతులందరికీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఆదివారం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. తర్వాత జరిగిన సభలో సీఎం రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతగా 68,89,955 మంది రైతులకు రైతు భరోసా అందించారు. 57,44,907 ఎకరాల 19 గుంటలకు ఆ నిధులు రిలీజ్ చేశారు. రైతులందరికీ ఎకరం వరకు రూ.3446.94 కోట్లు విడుదల చేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఆ నిధులు జమ చేయనున్నారు. మరో 45 రోజుల్లో మిగతా రూ.5,400 కోట్లను మరో రెండు విడతల్లో జమ చేయనున్నారు. ఎకరానికి ఏడాదికి రూ.12 వేల నిధులు కాగా యాసంగి సీజన్కు సంబంధించి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు రైతులకు అందుతున్నాయి.
రైతు భరోసాలో నల్గొండ టాప్
రైతు భరోసా నిధుల్లో నల్గొండ జిల్లా టాప్ లో నిలిచింది. ఈ జిల్లాలో 5,22,313 మంది రైతుల ఖాతాల్లో రూ.268.57 కోట్ల నిధులు జమ కానున్నాయి. తరువాత ఖమ్మం జిల్లాలో 3.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.169.51కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3.53 లక్షల మంది రైతుల అకౌంట్ లో రూ.167.80 కోట్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 3.01లక్షల మందికి రూ.157.95 కోట్లు, సిద్ధిపేట జిల్లాలో 3.53 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.153.44 కోట్ల నిధులు జమ చేయనున్నారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రూ.10.43 కోట్లు జమ కానున్నాయి.
