ట్రంప్ తో చర్చలే జరపలేదంటున్న ఇరాన్ : అమెరికాను నమ్మలేం అంటూ ప్రకటన

ట్రంప్ తో చర్చలే జరపలేదంటున్న ఇరాన్ : అమెరికాను నమ్మలేం అంటూ ప్రకటన

ఇరాన్ తో జరుగుతున్న చర్చలు బాగున్నాయి.. యుద్ధం ముగించే దిశగా చర్చలు జరుతున్నాయని.. ఈ క్రమంలోనే ఇరాన్ ఇంధన, విద్యుత్ ప్లాంట్లపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 

ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మీడియా స్పందించింది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అమెరికాను నమ్మలేం అని స్పష్టం చేసింది. గల్ఫ్, ఇజ్రాయెల్ ఇంధన, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామనే ప్రకటనతోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్లు చెబుతోంది ఇరాన్ దేశం. 

ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.. ఆయిల్ సంక్షోభం ఉంది.. దీన్ని కంట్రోల్ చేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లు అంచనా వేస్తుంది ఇరాన్. యుద్ధంలో మరింత సైనిక ప్రణాళికలు అమలు చేయటానికి.. అమెరికా బ్రేక్ తీసుకుందని.. ఇందులో భాగంగానే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఇరాన్ అంటోంది.

ఆయిల్ ధరలతోపాటు గల్ఫ్ దేశాలు, పశ్చిమాసియా దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్లతోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు ఇరాన్ సీనియర్ భద్రతా అధికారి. మా దేశ రక్షణలో వెనక్కి తగ్గేది లేదని.. నిరంతరం అప్రమత్తంగానే ఉంటామని స్పష్టం చేసింది ఇరాన్. కాల్పులు, దాడులకు 5 రోజుల బ్రేక్ అనేది.. అమెరికా వ్యూహాత్మక  ఎత్తుగడగానే భావిస్తామని.. చర్చలే జరగడం లేదని ఇరాన్ మీడియా ఏజెన్సీల నుంచి వార్తలు వస్తున్నాయి.