
- టెక్నికల్ సమస్యతో కేరళలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన యూకే ఎఫ్ 35 ఫైటర్ జెట్
- మూడు వారాలైనా కాని రిపేర్
- మిలిటరీ ప్లేన్ లో తీస్కెళ్లేందుకు బ్రిటన్ సన్నాహాలు
న్యూఢిల్లీ: గత నెల కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన అత్యాధునిక ఎఫ్-35బీ స్టెల్త్ ఫైటర్ జెట్ ను అతిపెద్ద సీ17 గ్లోబ్ మాస్టర్ విమానంలో ఆ దేశానికి తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్13న జరిగిన ఇండో–యూకే నేవీ విన్యాసాల్లో బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ప్రముఖ విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి ఎఫ్-35బీ జెట్ భారత నౌకాదళంతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొంది.
అయితే, ప్రతికూల వాతావరణం, ఇంధన కొరత కారణంగా జెట్ తిరిగి విమాన వాహక నౌకకు చేరుకోలేకపోయింది. దీంతో జూన్ 14న రాత్రి పైలట్ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ముందుగా ప్రతికూల వాతావరణం, ఇంధన కొరతతో దీన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆ ఫైటర్ జెట్లో ఇంజినీరింగ్ సమస్య ఉన్నట్టు తర్వాత తెలిసింది.
దాని రిపేర్కోసం బ్రిటిష్ రాయల్ నేవీ సాంకేతిక నిపుణులు, యూకేకు చెందిన 40 మంది ఇంజనీర్ల బృందం తిరువనంతపురం చేరుకుంది. గత 19 రోజులుగా వారంతా రిపేర్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. దీంతో యూకే అధికారులు ఈ జెట్ ను అతిపెద్ద సీ-17 గ్లోబ్మాస్టర్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లో తిరిగి యూకేకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఫైటర్ జెట్ భాగాలను విడదీసి అందులో బ్రిటన్కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎఫ్-35బీ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్.
ఈ యుద్ధ విమానానికి షార్ట్ టేకాఫ్ తో పాటు వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం ఉంది. అమెరికా సహా అతికొద్ది దేశాల సైన్యం వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. అమెరికాకు చెందిన లాఖీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన ఈ జెట్ ధర సుమారు 110 మిలియన్ డాలర్లు (సుమారు రూ.920 కోట్లు). ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్లలో ఒకటి.