ఆధార్ ​కార్డు తెస్తెనే నర్సన్న దర్శనం

ఆధార్ ​కార్డు తెస్తెనే నర్సన్న దర్శనం

వెలుగు, నెట్​వర్క్:  కరోనా లాక్​డౌన్​తో రాష్ట్రవ్యాప్తంగా మూతపడ్డ ఆలయాలు సోమవారం నుంచి ​ తెరుచుకోనున్నాయి. సుమారు 80 రోజుల తర్వాత దర్శనానికి అనుమతివ్వడంతో ఆఫీసర్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశమున్న యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర, కొండగట్టు, జోగులాంబ తదితర టెంపుల్స్​లో కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా ఆలయాలవారీగా భక్తులకు గైడ్​లైన్స్​ విడుదల చేశారు.

థర్మల్​ స్క్రీనింగ్​ చేశాకే లోపలికి..

భక్తులందరిని ఆలయ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్​ స్క్రీనింగ్ చేశాకే లోపలికి అనుమతిస్తారు. యాదాద్రిలో నర్సన్న దర్శనానికి వచ్చే భక్తులు తమ వెంట ఆధార్​కార్డు కచ్చితంగా తేవాలని అక్కడి ఆఫీసర్లు ప్రకటించారు. ఎవరికైనా జ్వరం, కరోనా లక్షణాలు కనిపిస్తే వారి కరెక్ట్​ అడ్రస్​ తెలిసిపోతుందని, అప్పుడు వారిని డీల్​ చేయడం ఈజీ అని చెబుతున్నారు. మిగిలిన ఆలయాల్లోనూ భక్తులెవరికైనా కరోనా సింప్టమ్స్​ కనిపిస్తే  సమీప హాస్పిటల్​కు పంపే ఏర్పాట్లు చేశారు. వేములవాడ, భద్రాద్రి, బాసర తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని సర్కారు దవాఖానల్లో ఇందుకోసం ఐసోలేషన్​ వార్డులను సిద్ధం చేసి ఉంచారు. భక్తులు చేతులను శుభ్రం చేసుకునేందుకు అన్ని ఆలయాల్లో వాష్​బేసిన్లు, సోప్​లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. రాజగోపురాల దగ్గర నుంచి ఆలయ మండపాలవరకు, క్యూలైన్లలో భక్తులు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా మార్కింగ్ చేశారు.

మాస్క్​ ఉండాల్సిందే..

దైవ దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలనే రూల్​ పెట్టారు.  చిన్న పిల్లలు, గర్భిణిలు, వృద్ధులు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ఆలయాలవారీగా వేర్వేరుగా గైడ్​లైన్స్​ విడుదల చేశారు. అన్ని ఆలయాల్లోనూ అభిషేకాలు, అర్చనలతో పాటు ఎలాంటి ప్రత్యేక పూజలకు పర్మిషన్​ లేదు. కేవలం లఘుదర్శనానికే అనుమతిస్తారు. భక్తులకు స్వామి వారి శఠగోపం పెట్టరు.  తీర్థ ప్రసాదాలు కూడా అందించరు.  గుడి గంట, కొబ్బరికాయ కొట్టే చాన్స్​ కూడా ఇవ్వరు. ప్రముఖ దేవాలయాల్లో  తలనీలాలు సమర్పించడాన్ని కూడా నిలిపివేశారు.

  • జగిత్యాల జిల్లాలోని కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాలలో నేటి నుంచి భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేశారు. కొండగట్టులో ఉదయం 7.30 నుంచి సాయంత్రం 4.30 వరకు, ధర్మపురి, కోటిలింగాలలో ఉదయం 6 నుంచి  సాయంత్రం 6 గంటల వరకు  కేవలం లఘుదర్శనానికే, అదీ పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని ఆఫీసర్లు చెప్పారు.
  • బాసరలో నేటి నుంచి ఉదయం 7, సాయంత్రం 6 గంటల మధ్య  సరస్వతీ అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆఫీసర్లు చెప్పారు. పరిమిత సంఖ్యలోమాత్రమే రావాలని చెప్పారు.
  • వరంగల్​లోని​ ప్రముఖ వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయాలకు  ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు  భక్తులను అనుమతిస్తామని ఆఫీసర్లు చెప్పారు.  వెయ్యి స్తంభాల గుడి చుట్టూ బారికేడ్లు కట్టి ఒక్కోసారి 10 మంది భక్తులను మాత్రమే లోపలికి పంపుతామని, భక్తులు సహకరించాలని సూచించారు.
  •  గద్వాల జిల్లాలోని శ్రీ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించేలా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  ఆలయానికి వచ్చే భక్తులు  కరోనా రూల్స్​కచ్చితంగా పాటించాలని ఈవో ప్రేమ్ కుమార్ కోరారు.
  • భద్రాచలంలోని  శ్రీసీతారామచంద్ర స్వామి దర్శనానికి ఉదయం 6.30 నుంచి సాయంత్రం 6.30 వరకు అనుమతిస్తారు. మాస్కు తప్పనిసరి.  థర్మల్​ స్క్రీనింగ్​ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

యాదాద్రిలో ప్రత్యేక గైడ్​లైన్స్​..

నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తెరుచుకోనుండగా, ఆఫీసర్లు ఆదివారం ప్రత్యేక గైడ్​లైన్స్​ విడుదల చేశారు. సోమవారం స్థానికులు, మాజీ ఉద్యోగులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.  మంగళవారం నుంచి భక్తులందరికీ లఘు దర్శనం ఉంటుంది. గంటకు 100 మంది చొప్పున  ప్రతి రోజు కనీసం 1000 మంది భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారని ఆఫీసర్లు అంచనా వేస్తన్నారు.  వారం తర్వాత పరిస్థితిని బట్టి స్లాట్ బుకింగ్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. ఆలయ పరిసరాలను పూర్తిగా శానిటైజేషన్ చేశారు.  ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేశారు. ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకూ స్వామి వారి లఘుదర్శనానికి సాధారణ భక్తులను అనుమతిస్తారు.  వీఐపీల కోసం ఉదయం 10 నుంచి 11 వరకు లఘు దర్శనాన్ని ఆపివేస్తారు. ఎవరికీ గర్భాలయంలోకి ప్రవేశం లేదు. ఆలయంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఇవ్వకున్నా, కొండపై స్వామి లడ్డు, పులిహోరా విక్రయానికి  స్టాల్స్ ఏర్పాటు చేశారు.  భక్తులకు గదుల కేటాయింపును రద్దు చేశారు. దర్శనం చేసుకున్న వెంటనే కొండ దిగి వెళ్లాల్సి ఉంటుంది. ఆన్​లైన్​లో ఈ టికెట్లు బుక్ చేసుకున్న  భక్తుల  గోత్ర నామాలతో పరోక్షంగా పూజలు నిర్వహించనున్నారు. కొండపైకి కార్లను నిషేధించారు. ఆర్టీసీ బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. ఆటోలు, టూ వీలర్లను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు. కొండపై ఉన్న దుకాణాలను సరిబేసి పద్ధతిలో రోజు విడిచి రోజు తెరవాలని ఆదేశాలు జారీ చేశారు.

వేములవాడలో కోడె మొక్కుకు అనుమతి లేదు

రాజన్న ఆలయంలో భక్తులకు కేవలం లఘు దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన పూజలకు ఆన్​లైన్​ ద్వారా అవకాశమిస్తున్నారు. స్మార్ట్​ఫోన్​ ఉంటే T APP FOLIO డౌన్​లోడ్​ చేసుకొని పూజలు బుక్​ చేసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ధర్మగుండంలోకి, గర్భగుడిలోకి వెళ్లనివ్వరు. కోడె మొక్కులకు అవకాశం లేదని చెప్పారు.  కోవిడ్​ లక్షణాలు కనిపిస్తే  ప్రత్యేక గదికి తరలించి, డాక్టర్లకు సమాచారం ఇస్తారు. 10 ఏళ్లలోపు చిన్నారులకు, 60ఏళ్లు పైబడిన వృద్ధులను అనుమతించబోమని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

 

ఈ సారి తనిఖీలు లేకుండానే కాలేజీలకు గుర్తింపు