హైదరాబాద్, వెలుగు: పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సెంట్రల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(సీసీఆర్బీ), డిస్ట్రిక్ట్ క్రైం రికార్డ్స్ బ్యూరో(డీసీఆర్బీ) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. నేరస్తులను గుర్తించడం, నేరాలు జరగకుండా ముందస్తుగా అలర్ట్ చేసేందుకు ఈ రెండు బ్యూరోలు పనిచేస్తున్నాయని తెలిపారు. సోమవారం డీజీపీ ఆఫీసులో డీసీఆర్బీ, సీసీఆర్బీ సిబ్బందితో అర్ధ వార్షిక సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఐడీ చీఫ్, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఐజీలు షానవాజ్ ఖాసీం, చంద్రశేఖర్రెడ్డి, డీఐజీ అంబర్ కిశోర్ఝా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా సాక్ష్యాధారాలు సేకరించాలన్నారు. ఇందులో సీసీఆర్బీ, డీసీఆర్బీ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. దర్పణ్ యాప్లో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా మిస్సింగ్ కేసులు, గుర్తు తెలియని డెడ్బాడీలను గుర్తించడం సులువైందని వివరించారు. జైళ్ల నుంచి విడుదలైన నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు. ఫింగర్ప్రింట్ బ్యూరో డేటాతో ఇన్వెస్టిగేషన్ చేపట్టి నేరస్తులకు శిక్షపడేలా చేయాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించిన డీజీపీ.. మిస్సింగ్ కేసులపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు.