‘ధమాకా’లో వింటేజ్ రవితేజని చూస్తారు’ అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
కలిసి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా భీమ్స్ ఇలా ముచ్చటించాడు.
‘‘రవితేజ గారి చిత్రానికి వర్క్ చేయడం ఇది రెండోసారి. ఈ అవకాశం రావడం గర్వంగా ఫీలవుతున్నా. ఇప్పటివరకూ విడుదలైన ప్రతి పాట మిలియన్స్ కొద్దీ వ్యూస్ను సాధించింది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమాకు రీసౌండ్ వస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో వింటేజ్ రవితేజని చూస్తారు. దాని ప్రకారం ఈ కథకు ఆయన ఎంత యాప్ట్ అనేది ఊహించుకోవచ్చు. ఊహించని మలుపులతో సాగే కథనం ఆకట్టుకుంటుంది. ఆయన క్లాస్, మాస్ క్యారెక్టర్స్ చేశారు. ఆ రెండు పాత్రలకు తగ్గట్టుగా సాంగ్స్ కంపోజ్ చేశా.
ఇప్పటి వరకు విడుదలైన జింతాక్, వాట్స్ హ్యాపెనింగ్, మాస్ రాజా, డుడు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మరో పాట వుంది. అది నేనే రాసి పాడాను. లిరిక్ రైటర్గా కెరీర్ ప్రారంభించి మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్న నేను.. అప్పుడప్పుడు ‘ముంబై పోతావా రాజా’ లాంటి పాటలు కూడా పాడాను. కాకపోతే ‘జింతాక్’ పాటతోనే సింగర్గా మంచి గుర్తింపు వచ్చింది. నా పేరు వినగానే మాస్ పాటలు గుర్తొస్తాయని చాలామంది అంటుంటారు. నాకైతే మాస్, మెలోడీ అనే తేడా లేదు. నాది ఒకే ఒక్క జానర్.. జనం జానర్.. వాళ్లకు నచ్చే అన్ని రకాల పాటలు కంపోజ్ చేస్తా. ప్రస్తుతం పదిహేను సినిమాలతో బిజీగా ఉన్నా’’.