ధరణి అప్లికేషన్లకు మోక్షం

ధరణి అప్లికేషన్లకు మోక్షం
  •     జిల్లాలో పెండింగ్​లో  6,175 అర్జీలు
  •     నేటి నుంచి 86 టీమ్స్​ ఫీల్డ్​ విజిట్​
  •     లిటిగేషన్​ లేని వాటిని సెటిల్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు 
  •     మూడున్నరేండ్ల తర్వాత ముందడుగు

నిజామాబాద్, వెలుగు : పెండింగ్​లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం సమాయత్తమవుతుంది.ఈ నెల 9 వరకు వీలున్న ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు 2020, అక్టోబరు నుంచి పెండింగ్​లో ఉన్న ఫైళ్లను పరిశీలిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను వేరు చేశారు. సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఇందుకోసం 86 టీమ్స్​ను ఏర్పాటు చేశారు.

పరిష్కారం దిశగా..

జిల్లాలోని 6,135 అర్జీలు పెండింగ్​లో ఉండగా వీటి పరిష్కారం విషయమై ఆఫీసర్లు ఇప్పటికే ఓ  అవగాహనకు వచ్చారు. భూమి రిజిస్ట్రేషన్​ ముగిసి ధరణి రాకతో ముటేషన్లు ఆగిపోయిన 407 ఆర్జీలకు ఇప్పుడు మోక్షం లభించనుంది. వారంతా కొత్త పాస్​బుక్స్​ అందుకోనున్నారు.1633 జీఎల్​ఎం (గ్రీవెన్స్​ ఆఫ్​ ల్యాండ్​ మేటర్) పరిష్కారం కానున్నాయి. ఫొటో కరెక్షన్​, జెండర్​, ఆధార్, క్యాస్ట్​, డిజిటల్​ సైన్​, మిస్సింగ్​ సర్వే నంబర్​ తదితరాలు జీఎల్​ఎం పరిధిలోకి వస్తాయి. వీటిని సులభంగానే పరిష్కరించే వీలున్నా గత ప్రభుత్వం పెండింగ్​లో  పెట్టింది.

633 సక్సెషన్​ (డెత్​ కేసు​ వారసులు), 69 ఎల్​ఏజీ (ల్యాండ్​ ఎక్వైరింగ్​ పెండింగ్​), 26 ఖాతా మెర్జింగ్(ఒకే గ్రామంలో రెండేసి రెవెన్యూ ఖాతాలున్న వాటిని ఒక్కచోట చేర్చి ఒకే పాస్​బుక్​ ఇవ్వడం)​, 33 టీఎం (నిషేధిత భూమి రికార్డులోకి పొరపాటున చేర్చిన సర్వే నంబర్లు) దరఖాస్తులను పరిష్కరించునున్నారు. అయితే నిషేధిత సర్వే భూములకు సంబంధించిన 365 ఆర్జీలను మాత్రం పక్కనబెట్టారు. 555 అర్జీలకు సంబంధించి పెండింగ్​ కోర్టు కేసులుండగా​ వాటి జోలికి వెళ్లడంలేదు.

ఎకరం రూ.50 లక్షలలోపు రిజిస్ట్రేషన్​ విలువ ఉన్న భూములకు సంబంధించిన దరఖాస్తులు జిల్లాలో, ఆపై విలువ ఉన్నవి సీసీఎల్​ఏకు  పంపాలనే ఆదేశాలు ఉన్నాయి. అయితే సీసీఎల్​ఏకు రిఫర్​ చేసే విలువైన భూములు జిల్లాలో లేనందున మెజార్టీ నిర్ణయాలు జిల్లా స్థాయిలోనే జరుగుతాయి.

కోర్టు వివాదం లేని వాటిపై ఫోకస్..

రకరకాల భూ వివాదాలకు సంబంధించి కలెక్టర్​ వద్ద మొత్తం 6,135 అప్లికేషన్లు పెండింగ్​లో ఉండగా వీటిలో నిజామాబాద్​ డివిజన్​లో 2,818, బోధన్​లో 1,297, ఆర్మూర్​ లో 2,020 ఆర్జీలు  ఉన్నాయి. వీటిలో చాలా మేరకు మండల, రెవెన్యూ డివిజన్​ స్థాయి అధికారులు పరిష్కరించేవే ఉన్నాయి. కానీ గత బీఆర్​ఎస్​ సర్కార్​ వీటి పరిష్కారంపై దృష్టి సారించలేదు.​ ఆఫీసర్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వకపోవడంతో వేల కొద్దీ అర్జీలు ఏండ్ల తరబడి మూలనపడ్డాయి. పూర్తిస్థాయిలో భూయాజమాన్య హక్కులు దక్కక అనేక మంది ఆందోళన చెందుతూనే ఉన్నారు.

2020, అక్టోబర్​లో ధరణి పోర్టల్​ ను తీసుకొచ్చాకే  ఈ సమస్యలన్నీ వచ్చాయి. వేలాది మంది రైతులను గోస పెడుతున్న ధరణి పోర్టల్​పై కాంగ్రెస్​ సర్కార్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది.యాజమాన్య ​హక్కులు దక్కకుండా పడుతున్న భూ యమజమానుల దరఖాస్తుల పరిష్కారానికి ఫస్ట్​ ప్రయార్టీ ఇచ్చింది. కోర్టు వివాదాలు లేని ప్రతి ఆర్జీని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా కలెక్టర్​ తహసీల్దార్​, డీటీ, ఆర్​ఐ, ఏఈవో, పంచాయతీ సెక్రెటరీ, కమ్యూనిటీ సర్వేయర్లతో టీమ్​లను ఏర్పాటు చేశారు.