
హైదరాబాద్, వెలుగు: అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదమైనా.. వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లినా.. ఇలా అత్యవసరం ఏదైనా సరే ఒకే ఒక్క నంబర్ డయల్ 112కు కాల్ చేయాలని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి సూచించారు. ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ కింద ఒక దేశం.. ఒకే అత్యవసర నంబర్గా ‘డయల్ 112’ను నిర్ధారించినట్టు తెలిపారు.
ఈ మేరకు శనివారం (june 21) పత్రిక ప్రకటన విడుదల చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు ఈ టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందిస్తే ఆయా ప్రమాదాల నుంచి కాపాడేందుకు అవసరమైన పోలీసు, అగ్నిమాపకశాఖ, అంబులెన్స్ వంటి అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే ఈ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ ఏదైనా..
పోలీసు సహాయం (నేరం, దొంగతనం, ప్రమాదాలు), అగ్ని ప్రమాదాల సమయంలో అత్యవసర పరిస్థితులు, హెల్త్ ఎమర్జెన్సీ, రోడ్డు ప్రమాదాలు, ఆపదలో ఉన్న మహిళలు/పిల్లలు, ప్రకృతి వైపరీత్యాలు ఇలా ఎలాంటి అత్యవసరంలో ఉన్న వారైనా సరే డయల్ 112 ద్వారా సహాయం కోసం సమాచారం అందించవచ్చు. ఇది 24 గంటలపాటు అందుబాటులో ఉంటుందని కమలాసన్ రెడ్డి తెలిపారు.
బాధితుల నుంచి వచ్చే ఫోన్కాల్స్ అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ (ఈఆర్ఎస్ఎస్) కాల్ సెంటర్ ద్వారా అనుసంధానం చేస్తామన్నారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే వారి లొకేషన్ను ట్రాక్ చేసి.. జీపీఎస్ అధారితంగా ఇది పనిచేస్తుందని చెప్పారు. బాధితుడి అవసరాన్ని బట్టి సమీపంలోని పోలీస్ పెట్రోలింగ్ వాహనం లేదా ఫైర్ టెండర్ లేదా అంబులెన్స్ పంపిస్తామని వెల్లడించారు.