ప్రశాంత్ కిశోర్ రహస్య ప్రయాణం..? కేంద్రం ఆరా..!

ప్రశాంత్ కిశోర్ రహస్య ప్రయాణం..? కేంద్రం ఆరా..!

లాక్ డౌన్ సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కోల్ కతాకు వెళ్లారా అని  కేంద్రం ఆరా తీస్తుంది. పశ్చిమ్ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ ఆహ్వనం మేరకు ప్రశాంత్ కిశోర్ కోల్ కతాకు కార్గో ఫ్లైట్‌లో వెళ్లారని వస్తున్న వార్తలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించింది కేంద్రం. అయితే తాము విచారణ ప్రారంభించామని తెలిపారు అధికారులు. ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిందిగా అన్ని విమానాశ్రయాలను కోరామని తెలిపారు.

తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు ప్రశాంత్ కిశోర్. మార్చి 19 తర్వాత తాను విమాన ప్రయాణం చేయలేదని చెప్పారు. ఇందుకు విరుద్దంగా సమాచారం ఉంటే పబ్లిక్ డొమేన్ లో పెట్టాలని అన్నారు. అయితే మమతా బెనర్జీతో వరుస సమావేశాలు మార్చ్ 19న జరిగాయని ఆతర్వాత ప్రశాంత్ కిశోర్ బెంగాల్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారని ఆయన సన్నిహితులు చెప్పారు. కరోనాను కట్టడి చేయడంలో బాగంగా మార్చ్ 22నుంచి భారత ప్రభుత్వం విమాన సర్వీసులను ఆపేసింది. అయితే కార్గో విమానాలు తిరిగేందుకు మాత్రం అనుమతులను ఇచ్చింది. ఇప్పటివరకు 347 కార్గో విమానాలు తిరిగాయి.

కరోనా విజృంభిస్తున్న సమయాన కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతుంది. అయితే బెంగాల్ ప్రభుత్వం మాత్రం కేంద్రానికి పలు విషయాల్లో సహకరించడంలేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో కరోనా తీవ్రతను కనుక్కోవడానికి కేంద్ర బృందాలు బెంగాల్ లో పర్యటించాయి. దీంతో పాటు ప్రశాంత్ కిషోర్ లాక్ డౌన్ సమయంలో  బెంగాల్‌లో పర్యటించారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.