- 29 మంది నుంచి రూ.23 కోట్ల 50 లక్షలు వసూలు
- డైరెక్టర్ రాజేశ్ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులురూ.23 లక్షలు సీజ్
హైదరాబాద్, వెలుగు: వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ నంగనూర్ రాజేశ్ను సిటీ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రూ.23 లక్షలు క్యాష్ సీజ్ చేశారు. నాంపల్లి కోర్టులో అతడిని హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. సీసీఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రాజేశ్ సిటీకి వచ్చి ఎల్లారెడ్డిగూడలో వీఆర్ఆర్ పేరుతో కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రారంభించాడు. తన కంపెనీలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నాడు.
కొంతకాలం తక్కువ మొత్తంలో లాభాలు, వడ్డీలు చెల్లించాడు. నమ్మకం కలిగే విధంగా ప్లాన్ చేశాడు. పెట్టిన పెట్టుబడితో ప్రతి ఏటా 24 శాతం నుంచి 27 శాతం వరకు రిటర్న్స్ ఇస్తానని పలువురిని నమ్మించాడు. ఇలా 29 మంది వద్ద రూ.23 కోట్ల 50 లక్షలు వసూలు చేశాడు. సేకరించిన డబ్బును తన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేశాడు. వీఆర్ఆర్లో ఇన్వెస్ట్ చేసిన వారికి డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రాజేశ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.