హిట్, హిట్ 2 చిత్రాలతో మెప్పించిన శైలేష్ కొలను.. వెంకటేష్ హీరోగా ‘సైంధవ్’ చిత్రం తీశాడు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుదలవుతున్న సందర్భంగా శైలేష్ మాట్లాడుతూ ‘‘హిట్ 2’ తర్వాత నిర్మాత వెంకట్ గారి సూచనతో వెంకటేష్ గారిని కలిసి ఈ స్టోరీ వినిపించాను. ఆయనకి చాలా నచ్చింది. ఆ తర్వాత ఆ లైన్ను డెవలప్ చేసి పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా చెప్పాను. మొత్తం విన్నాక ఓ హగ్ ఇచ్చి ఇది మనం చేస్తున్నాం అన్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా చాలా ఆర్గానిక్గా రాసిన కథ ఇది.
స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి గురించి, దాని ట్రీట్మెంట్కు అవసరమయ్యే రూ.17 కోట్ల ఇంజక్షన్ గురించి ఇందులో చర్చించాం. అయితే దీన్నొక సందేశంలా కాకుండా సినిమాటిక్గా చెప్పాం. మొదటి పదిహేను నిమిషాల తర్వాత ప్రేక్షకులు తల తిప్పుకోలేనంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. నవాజుద్దిన్ గారి పాత్ర యూనిక్గా ఉంటుంది. కథ నచ్చి ఆర్య, ఆండ్రియా, రుహాని శర్మ ఇందులో భాగమయ్యారు.
ఎమోషనల్ డెప్త్ వున్న కథ తీయడం నాకిదే ఫస్ట్టైమ్. వెంకటేష్ గారు ఎమోషనల్ సీన్స్లో చాలా అద్భుతమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆయన సలహాల వల్లే ఆ సీన్స్ చాలా బాగా వచ్చాయి. వెంకటేష్ గారి 75వ చిత్రం ఎలా ఉండాలో ఆలా చేశాం. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. ‘సైంధవ్’ను జనం ఇష్టపడితే సీక్వెల్ తీస్తాం. ‘హిట్ 3’ రైటింగ్ వర్క్ జరుగుతోంది’ అని చెప్పాడు.