V6 News

కలవని ‘చేతులు’ .. మంచిర్యాల సభలో మరోసారి బయటపడ్డ విభేదాలు 

కలవని ‘చేతులు’ .. మంచిర్యాల సభలో మరోసారి బయటపడ్డ విభేదాలు 

మంచిర్యాల, వెలుగు:   స్టేట్​ కాంగ్రెస్  నేతల మధ్య విభేదాలు మంచిర్యాల సభలో మరోసారి బయటపడ్డాయి.  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి నస్పూర్​లో  జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే  చీఫ్ గెస్ట్​గా హాజరుకాగా,  జాతీయ స్థాయిలో కీలక నేత కొప్పుల రాజు,  స్టేట్​ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావు ఠాక్రే పాల్గొన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్​ ఎ.రేవంత్​రెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి,  స్టార్ క్యాంపెయినర్ మధుయాష్కీ, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్​బాబు, జగ్గారెడ్డి,  సీతక్క, ఎమ్మెల్సీ టి.జీవన్​రెడ్డి తదితరులు హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గేతో కలిసి వేదిక మీదికి వచ్చిన రేవంత్​రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరూ పట్టించుకోలేదు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డి, మధుయాష్కీ, దుద్దిళ్ల శ్రీధర్​బాబు, మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్​సాగర్​రావు తదితరులు భట్టి విక్రమార్క చేతులు పట్టుకొని వేదికపై నుంచి సభికులకు అభివాదం చేశారు. 

అనంతరం పలువురు మాట్లాడుతూ.. విక్రమార్కను పొగడ్తల్లో ముంచెత్తారు.  కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఏకంగా ఆయనను దివంగత వైఎస్​ఆర్​తో  పోల్చారు. భట్టి పంచెకట్టుతో పాదయాత్ర చేస్తుంటే తనకు వైఎస్​ఆర్​ను చూసినట్టు ఉందని ఆకాశానికి ఎత్తారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క, ప్రేమ్​సాగర్​రావు  అనుచరులు ‘‘సీఎం భట్టి... సీఎం భట్టి’’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ఉత్తమ్​కుమార్​రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్​బాబు సైతం విక్రమార్కను పొగుడుతూ మాట్లాడారు.  ప్రేమ్​సాగర్​రావు తన స్పీచ్​లో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వేదికపై ఉన్న లీడర్లలో ఎవరో ఒకరు సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అప్పుడు కూడా లీడర్లందరూ భట్టి వైపు చూడడంతో  రేవంత్ అసహనంగా కనిపించారు. వేదికపై మల్లికార్జున ఖర్గే పక్కన ఉత్తమ్​కుమార్​రెడ్డి కూర్చోగా ఆయన పక్కన రేవంత్​రెడ్డి, ఆ పక్కన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కూర్చున్నారు. చాలాసేపటి వరకు రేవంత్​ను ఎవరూ పలకరించలేదు. ఈ సభకు అన్నీ తానై వ్యవహరించిన ప్రేమ్​సాగర్​రావు సైతం ఆయనను రిసీవ్​ చేసుకోలేదు. 

ఇది గమనించిన ఏఐసీసీ సెక్రెటరీ సంపత్​కుమార్​గౌడ్  రేవంత్ దగ్గరకు వచ్చి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డిలతో ఏదో మాట్లాడారు. ఆ తర్వాత ఈ ముగ్గురు మాటలు కలిపి నవ్వుకున్నారు.  ఈ పరిణామాలతో కంగుతిన్న రేవంత్​రెడ్డి సభా వేదికపై చాలా అసహనంగా కనిపించారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అభిమానులు ‘‘జై రేవంత్, జై జై రేవంత్”అంటూ నినాదాలు చేసినప్పటికీ ఆయనలో అంత ఉత్సాహం కనిపించలేదు. చివరగా మాట్లాడిన కొప్పుల రాజు, మల్లికార్జున ఖర్గే సైతం తమ స్పీచ్​లో ‘‘సీఎం భట్టి’’ అన్న కామెంట్లను ఖండిస్తారని అనుకున్నప్పటికీ వారు సైతం వినీ విననట్టు వదిలేశారు. రేవంత్ వ్యతిరేక వర్గం లీడర్లు ఆయనను ఒంటరి చేసి మాట్లాడడాన్ని రేవంత్​ ఫాలోవర్స్​ జీర్ణించుకోలేకపోతున్నారు.  కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవంటూనే తామంతా ‘బలగం’ సినిమాలో వలె కలిసిపోతామంటూనే ఎడమొహం పెడమొహంగా వ్యవహరించడం స్టేట్ కాంగ్రెస్ లీడర్ల మధ్య విభేదాలు సమసిపోయే స్థాయిలో  లేవన్న సంకేతాలు కనిపించాయి.  ఈ పరిణామాలపై అటు రేవంత్ వర్గంలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

రేవంత్ అనుచరులు దూరం..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్​సాగర్​రావు వన్ మ్యాన్ షో చేశారు. మొదటి నుంచి రేవంత్​రెడ్డితో విభేదిస్తూ భట్టి విక్రమార్క గ్రూపులో కొనసాగుతున్న ఆయన ఈ సభకు సైతం రేవంత్​ అనుచరులను దూరం పెట్టి తన పంతం నెగ్గించుకున్నారు. మాజీ మంత్రి గడ్డం వినోద్, టీపీసీసీ సెక్రెటరీ గోమాస శ్రీనివాస్, సీనియర్ లీడర్ కేవీ ప్రతాప్,  ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ జనక్​ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు అమురాజుల శ్రీదేవి, బోడ జనార్దన్,  నాయకుల కారుకూరి రామచందర్, ముత్తె సత్తయ్య, మత్తమారి సూరిబాబు తదితరులు ప్రేమ్​సాగర్​రావును వ్యతిరేకిస్తూ రేవంత్​తో టచ్​లో ఉంటున్నారు. ఈ కారణంగా వీరిని ఉమ్మడి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్రకు దూరం పెట్టారు. అదేవిధంగా బహిరంగ సభకు వారు హాజరుకావద్దని ప్రేమ్​సాగర్​రావు షరతు పెట్టారు. చివరి నిమిషంలో అయినా తమకు ఆహ్వానం అందుతుందని వీరంతా ఎదురుచూసినప్పటికీ  వేదిక పైకి రావడానికి పాస్​లు కూడా ఇవ్వకపోవడంతో కంగుతిన్నారు. 

వీరంతా మంచిర్యాలలోని గోమాస శ్రీనివాస్  నివాసంలో సమావేశమై భవిష్యత్ యాక్షన్​ ప్లాన్​పై చర్చించుకున్నట్లు సమాచారం.  అలాగే కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పలువురు లీడర్లకు సైతం ఆహ్వానం అందలేదు. అంతేకాకుండా మొన్నటివరకు ఏఐసీసీ నిర్ణయాల అమలు కమిటీ చైర్మన్​గా వ్యవహరించిన ఏలేటి మహేశ్వర్​రెడ్డితో ప్రేమ్​సాగర్​రావుకు విభేదాలు ఉండేవి. సరిగ్గా బహిరంగ సభకు ఒక్కరోజు ముందు మహేశ్వర్​రెడ్డి కాంగ్రెస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం తెలిసిందే. ఉమ్మడి జిల్లాపై ఆధిపత్యం సాధించడం కోసం ప్రయత్నిస్తున్న ప్రేమ్​సాగర్​రావుకు మహేశ్వర్​రెడ్డి అడ్డుగా నిలిచారు. ఆయన బీజేపీలో చేరడంతో ప్రేమ్​సాగర్​రావు కల నెరవేరినట్లు అయింది. బహిరంగ సభలో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 10 ఎమ్మెల్యే సీట్లకు  8 సీట్లు సాధిస్తామని ఆయన చెప్పడం దీనికి నిదర్శనం. నిర్మల్​కు చెందిన బీఆర్ఎస్ లీడర్ శ్రీహరిరావు త్వరలోనే రేవంత్​రెడ్డి ద్వారా కాంగ్రెస్​లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయన చేరితే ఉమ్మడి జిల్లాలో మళ్లీ రేవంత్, భట్టి గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్న పరిస్థితి ఏర్పడవచ్చునని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.