ఇల్లెందు మున్సిపాలిటీలో వీగిన అవిశ్వాసం

ఇల్లెందు మున్సిపాలిటీలో వీగిన అవిశ్వాసం
  •     చైర్మన్​గా కొనసాగనున్న డి.వెంకటేశ్వరరావు
  •     కోరం లేకుండా చేయడంలో సక్సెస్​ అయిన కాంగ్రెస్​ 
  •     అధికార పార్టీ, బీఆర్​ఎస్​ నేతల మధ్య తోపులాట 
  •     హైడ్రామా, నిరసనలతో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
  •     ఎమ్మెల్యే కనకయ్యతో పాటు పలువురు కాంగ్రెస్​ లీడర్లపై బీఆర్​ఎస్​ కౌన్సిలర్ల ఫిర్యాదు  

భద్రాద్రికొత్తగూడెం/ ఇల్లెందు, వెలుగు : ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. సోమవారం తోపులాట, నిరసనలు, హైడ్రామాల మధ్య ఈ కార్యక్రమం ముగిసింది.  బీఆర్​ఎస్​కు మెజార్టీ ఉన్నా కోరం లేకుండా చేయడంలో కాంగ్రెస్, సీపీఐ లీడర్లు సక్సెస్​ అయ్యారు. దాదాపు రెండు వారాల పాటు క్యాంప్​లో ఉంచి కౌన్సిలర్లను కాపాడుకున్న బీఆర్​ఎస్​ నేతలు చివరిక్షణంలో ఫెయిల్​ అయ్యారు. 

జరిగింది ఇదీ..

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లున్నారు. బీఆర్ఎస్​ నుంచి 19మంది కౌన్సిలర్లు, ముగ్గురు ఇండిపెండెంట్లు, న్యూడెమోక్రసీ, సీపీఐ పార్టీల నుంచి ఒక్కొక్క కౌన్సిలర్​ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్​ఎస్​ కు చెందిన మున్సిపల్​ చైర్మన్​ దమ్మాల పాటి వెంకటేశ్వరరావుతో పాటు కొందరు ఆ పార్టీకి గుడ్​బై చెప్పి కాంగ్రెస్​లో చేరారు.

దీంతో చైర్మన్​పై బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు అవిశ్వాసం పెడుతూ కలెక్టర్​కు గత నెలలో లేఖ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం అవిశ్వాసంపై స్పెషల్​ మీటింగ్ పెడుతున్నట్టు కలెక్టర్​ ప్రకటించి కౌన్సిలర్లకు నోటీసులు ఇచ్చారు. 

అంతా రహస్యం..

కలెక్టర్​ నుంచి చైర్మన్​పై అవిశ్వాసం నోటీస్​ రాగానే బీఆర్​ఎస్​ లీడర్లు అలర్ట్​ అయ్యారు. సీపీఐ కౌన్సిలర్​ రవీందర్​తో పాటు 14 మంది బీఆర్​ఎస్​ కౌన్సిలర్లను తీసుకొని గోవాలో బీఆర్​ఎస్​ లీడర్లు క్యాంప్​ పెట్టారు. మరో బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు మడత రమ, అనిత రెండు రోజుల కిందట క్యాంప్​లో జాయిన్​ అయ్యారు. వారు ఎక్కడ ఉన్న విషయాన్ని బయటికి లీక్​ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

సోమవారం జరిగే అవిశ్వాసం మీటింగ్​ సమయానికి అక్కడికి చేరుకుంటామని లీకులు ఇచ్చారు. కానీ ఆదివారం సాయంత్రమే మున్సిపల్​ ఆఫీస్​ పక్కనే ఉన్న పెన్షనర్స్​ బిల్డింగ్​కు గుట్టు చప్పుడు కాకుండా క్యాంప్​లో ఉన్న కౌన్సిలర్లంతా చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం 10.15 గంటల వరకు వారు అక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. 

హైడ్రామా.. ఉద్రిక్తత 

అవిశ్వాసంపై స్పెషల్​ మీటింగ్​కు అటెండ్​ అయ్యేందుకు సీపీఐ కౌన్సిలర్​తో కలిసి బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు పెన్షనర్స్​ బిల్డింగ్​ నుంచి 10.20 గంటలకు ఒక్కొక్కరు బయటకు వస్తుండడాన్ని కాంగ్రెస్​ నాయకులు గమనించారు. మొదట వచ్చిన కౌన్సిలర్​ జేకే శ్రీను, తోట లలిత శారదను అడ్డుకునేందుకు కాంగ్రెస్​ కార్యకర్తలు, నాయకులు యత్నించగా వారు గొడవ పడుతూ అక్కడి నుంచి మున్సిపల్​ ఆఫీస్​లోకి వెళ్లారు.

ఇదే క్రమంలో చివరలో వచ్చిన కౌన్సిలర్​ కొక్కు నాగేశ్వరరావు మున్సిపల్​ ఆఫీస్​లోకి ఎమ్మెల్యే కోరం కనకయ్య పక్క నుంచి వెళ్తుండగా ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్​ లీడర్లు ఆయనను అడ్డుకొని ఎదురుగా ఉన్న ఎంపీడీఓ ఆఫీస్​లోకి లాక్కెళ్లారు. ఈ క్రమంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ లీడర్ల మధ్య తోపులాట సాగింది. అంతకుముందు ఎంపీడీఓ ఆఫీస్​లో బీఆర్​ఎస్​ లీడర్​ హరిప్రియతో పాటు కొక్కు నాగేశ్వరరావు కొంత సేపు అక్కడే ఉన్నారు.

టైం అవుతుండడంతో కొక్కు నాగేశ్వరరావు బయటకు రాగానే బీఆర్​ఎస్​ కార్యకర్తలు ఆయనను అడ్డుకునే అక్కడి నుంచి లాక్కెళ్లారు. సీపీఐ కౌన్సిలర్​ రవీందర్​ మీటింగ్​ అటెండ్​ అయ్యేందుకు మున్సిపల్ ఆఫీస్​లోకి రాగానే అక్కడే ఉన్న కొందరు ఆయనపై దాడి చేశారు. ఆయనను లాక్కెళ్లి మున్సిపల్​ ఆఫీస్​ వెనుక గోడ మీద నుంచి బయటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రవీందర్​కు గాయాలయ్యాయి. 

కౌన్సిలర్ల నిరసన.. 

కౌన్సిల్ మీటింగ్​లోకి బీఆర్​ఎస్​కు చెందిన 15 మంది కౌన్సిలర్లు మాత్రమే అటెండ్​ అయ్యారు. 24 మంది ప్రజాప్రతినిధులున్నా ఈ కౌన్సిల్​లో అవిశ్వాసంపై చర్చ సాగాలంటే 17 మంది అటెండ్​ కావాల్సి ఉంది. 15 మంది కౌన్సిలర్లు మాత్రమే అటెండ్​ అయ్యారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు వస్తారని చెప్పగా ఆర్డీఓ వారికి కొంత టైం ఇచ్చారు. అయినా రాకపోవడంతో కోరం లేనందున చైర్మన్​ డి. వెంకటేశ్వరరావుపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయిందని ఆమె ప్రకటించారు. దీంతో లోపల ఉన్న 15 మంది బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు మున్సిపాలిటీ ఆఫీస్​ బయటికి వచ్చి మాజీ ఎమ్మెల్యే భానోత్​ హరిప్రియతో కలిసి ధర్నా చేశారు.

పోలీసులు, ఆఫీసర్లు కాంగ్రెస్​ లీడర్ల అరాచకాలకు మద్దతు పలికారంటూ ఆరోపించారు. అంతకుముందు బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ కొక్కు నాగేశ్వరరావును  కాంగ్రెస్​ నాయకులు కిడ్నాప్​ చేశారంటూ ఆయన భార్య లక్ష్మితో పాటు కూతురు, కో ఆప్షన్​ మెంబర్​ సరిత మున్సిపల్​ ఆఫీస్​ ఎదుట బైఠాయించారు. తన భర్తను కాంగ్రెస్​ నాయకులు హత్య చేస్తారని లక్ష్మి ఆరోపించారు. అవిశ్వాసం మీటింగ్​ అనంతరం కాంగ్రెస్​ లీడర్ల ఆధీనంలో ఉన్న కొక్కు నాగేశ్వరరావు బయటికి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఎమ్మెల్యేపై పోలీసులకు కంప్లైంట్..

తమను కౌన్సిల్​ మీటింగ్​కు వెళ్లకుండా ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటుయ పలువురు కాంగ్రెస్​ లీడర్లు అడ్డుకున్నారని, తమ కౌన్సిలర్​ కొక్కు నాగేశ్వరరావును కిడ్నాప్​ చేశారని పలువురు బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన భర్త నాగేశ్వరరావును కాంగ్రెస్​ లీడర్లు కిడ్నాప్​ చేశారంటూ ఆయన భార్య లక్ష్మి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు పలువురు కాంగ్రెస్​ లీడర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్​ ఆఫీస్​ ఎదుట పోలీస్​లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.