కాళేశ్వరం ఈఈ అక్రమాస్తులు 150 కోట్ల పైనే.. భారీగా కూడబెట్టిన నూనె శ్రీధర్

కాళేశ్వరం ఈఈ అక్రమాస్తులు 150 కోట్ల పైనే.. భారీగా కూడబెట్టిన నూనె శ్రీధర్
  • శ్రీధర్ ​నివాసం, ఆఫీస్​, బంధువుల ఇండ్లలో ఏసీబీ దాడులు
  • 13 ప్రాంతాల్లో సోదాలు, స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం
  • కరీంనగర్, వరంగల్‌‌, హైదరాబాద్‌‌లో కమర్షియల్ బిల్డింగ్స్‌‌,19 ఓపెన్ ప్లాట్లు, 16 ఎకరాల భూమి 
  • బంగారు, డైమండ్, ప్లాటినం ఆభరణాలు, రెండు కార్లు సీజ్‌‌ 
  • అరెస్ట్​ చేసి, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్​
  • గాయత్రి(బాహుబలి) పంప్‌‌హౌస్‌‌ నిర్మాణంలో ఇన్ చార్జిగా వ్యవహరించిన శ్రీధర్‌‌‌‌
  • కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు


హైదరాబాద్‌‌/ కరీంనగర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్ హౌస్​కు ఇన్​చార్జిగా వ్యవహరించిన ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇండ్లపై ఏసీబీ రైడ్ చేసింది. రూ.150 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించింది.  గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడినట్టు  ఫిర్యాదులు అందడంతో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కరీంనగర్‌‌లోని శ్రీధర్ ఇల్లు, చొప్పదండిలోని ఆయన ఆఫీస్ సహా హైదరాబాద్‌‌, కరీంనగర్‌‌‌‌, వరంగల్‌‌లోని మొత్తం 13 ప్రాంతాల్లో బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బంగారు, డైమండ్, ప్లాటినం ఆభరణాలు, రెండు కార్లు సీజ్‌‌‌‌చేశారు.  రెండు బ్యాంక్‌‌‌‌ లాకర్లను గుర్తించారు. వీటిని గురువారం ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీధర్‌‌‌‌‌‌‌‌ను కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు తరలించారు. నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌‌‌కు తరలించారు. గురువారం కూడా సోదాలు కొనసాగనున్నాయి.

అధికారం అడ్డుపెట్టుకొని అక్రమార్జన 
శ్రీధర్‌‌‌‌.. ‌‌‌‌ప్రస్తుతం కరీంనగర్‌‌‌‌ జిల్లా ‌‌‌‌చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంప్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ సీఏడీ డివిజన్‌‌‌‌ 8 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌‌‌‌(ఈఈ)‌‌‌‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. టైగర్‌‌‌‌‌‌‌‌అనే ఇంజినీర్ల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్ మెంట్‌‌‌‌లో అసిస్టెంట్‌‌‌‌ఇంజినీర్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ ప్రాజెక్టులు, కాంట్రాక్టర్ల వద్ద పెద్ద మొత్తంలో ముడుపులు, టెండర్లను బట్టి కమీషన్లు తీసుకునేవాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ నిర్మాణం ఆయనకు బాగా కలిసొచ్చింది. గాయత్రి పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ ఇన్​చార్జిగా అక్రమాలకు పాల్పడ్డట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని హైదరాబాద్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌లో పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అత్యంత విలువైన ప్రాంతాల్లో ఖరీదైన బిల్డింగులు, విల్లాలు కొనుగోలు చేసినట్టు తేల్చారు. 

మొదటి రోజు గుర్తించిన ఆస్తులు ఇవే.. 
శ్రీధర్​కు హైదరాబాద్ లోని మలక్‌‌‌‌పేట్‌‌‌‌లో 4 అంతస్తుల బిల్డింగ్‌‌‌‌, షేక్‌‌‌‌పేట్‌‌‌‌లోని స్కై హై అపార్ట్‌‌‌‌ మెంట్స్‌‌‌‌ లో 4,500 ఎస్​ఎఫ్​టీ విస్తీర్ణంలో లగ్జరీ ఫ్లాట్‌‌‌‌, తెల్లాపూర్‌‌‌‌‌‌‌‌లోని ఉర్జిత్‌‌‌‌ గేటెడ్ ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లో విల్లా, అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లో  కమర్షియల్‌‌‌‌స్పేస్‌‌‌‌, వరంగల్ లో జీప్లస్ 3 బిల్డింగ్,  కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో 3 ఫ్లాట్లు, ఇండిపెండెంట్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌సహా 16 ఎకరాల వ్యవసాయ భూమి, కరీంనగర్ లోని పలు ప్రముఖ హోటళ్లలో పార్ట్ నర్ షిప్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 3 జిల్లాల్లో కలిపి మొత్తం 19 రెసిడెన్సియల్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌ ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు తేల్చారు.

వీటి విలువ ప్రస్తుత మార్కెట్‌‌ ‌‌వ్యాల్యూ ప్రకారం సుమారు రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌ అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లోని కమర్షియల్‌‌‌‌స్పేస్‌‌‌‌లో ప్రతినెలా రూ.50 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నట్టు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈఈ శ్రీధర్ నివాసాల్లో ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులతోపాటు బినామీ పేరిట ఉన్న కోట్లాది రూపాయల  ఆస్తులను ఏసీబీ ఆఫీసర్లు గుర్తించినట్లు తెలిసింది. బినామీల వివరాలను ఆరా తీస్తున్నారు.

థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌లో కొడుకు పెండ్లి
కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని వివిధ హోటళ్లలో శ్రీధర్​ భాగస్వామిగా ఉన్నట్టు ఏసీబీ ఆఫీసర్లు గుర్తించారు. తన బినామీల ద్వారా రియల్ ఎస్టేట్‌‌‌‌వ్యాపారంలోనూ పెట్టుబడులు పెట్టినట్టు తెలిసింది. అక్రమ సంపాదనతో తన కుమారుడి వివాహం థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌లో ఘనంగా నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పెండ్లి కోసం ప్రత్యేకంగా ఫ్లైట్ బుక్ చేసినట్లు తెలిసింది. ఇందుకుగాను రూ.కోట్లలో ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు. వీటికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు.