హైదరాబాద్ లోని కూకట్ పల్లి వై జంక్షన్ దగ్గరున్న లేక్ షోర్ మాల్ లో ప్రమాదం జరిగింది. మాల్ చూసేందుకు వచ్చిన జనంపై ఒక్కసారిగా బోర్డులు పడిపోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( మార్చి 8 ) కావడంతో జనం తాకిడి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మాల్ సిబ్బంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని నెలల క్రితమే ఓపెన్ చేసిన మాల్ కావడంతో లేక్ షోర్ మాల్ లో జనం తాకిడి ఎక్కువగానే ఉంటుంది.. పైగా వీకెండ్స్ లో తాకిడి ఎక్కువ ఉండటం మాములే. ఇవాళ కూడా తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో మాల్ లో ఉన్నోళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అయితే, ఈ ఘటనలో పలువురికి గాయాలు మినహా ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
