నల్గొండ కారులో కల్లోలం !

నల్గొండ కారులో కల్లోలం !
  •     ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డితో విభేదించే లీడర్లను పక్కన పెడుతున్న మాజీ ఎమ్మెల్యేలు 
  •     పార్లమెంట్​స్థాయి సమావేశాల్లో లీడర్లకు అవమానం 
  •     ఇప్పటికే పార్టీకి దూరమైన మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి, అమిత్​ 
  •     హైకమాండ్​ను మిస్​గైడ్ చేస్తున్నారనే ఆరోపణలు

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్​ పార్టీలో కల్లోలం నెలకొంది. పార్లమెంట్​ ఎన్నికల్లో పార్టీ నాయకత్వం సమష్టిగా పనిచేయాలని కేటీఆర్, హరీశ్​రావు చెప్పినా జిల్లా నేతల మధ్య సఖ్యత లేకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. ఎంపీ టికెట్​ఆశించిన వారిని నల్గొండ, భువనగిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశాలకు పిలవకుండా దూరం పెట్టారని మండిపడుతున్నారు. మీటింగ్​లకు చెప్పలేదన్న బాధ కంటే, వచ్చిన ముఖ్యమైన లీడర్లను కనీసం వేదికపైకి పిలవకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

రెండు ఎంపీ సెగ్మెంట్లకు జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులను డిసైడ్​చేయడంలో కూడా జగదీశ్​రెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనతో విభేదించే లీడర్లను పార్టీ కార్యక్రమాలకు పిలవట్లేదు. ఇప్పటికే మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి కొడుకు అమిత్​కు ఎంపీ టికెట్​ఇవ్వకుండా అవమానించారు. దీంతో ఆయన కాంగ్రెస్​ లీడర్లతో టచ్ లో ఉన్నాడనే కారణంతో పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. నల్గొండ, భువనగిరి ఎంపీ టికెట్​ఆశించిన అమిత్.. రెండుచోట్ల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు వెళ్లలేదు.

సుఖేందర్​రెడ్డి సైతం అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి సైలెంటయ్యారు. నల్గొండ ఎంపీ క్యాండేట్ కంచర్ల కృష్ణారెడ్డి గుత్తాను మర్యాదపూర్వకంగా కలవడం మినహా... ముఖ్యమైన లీడర్లు ఎవరూ ఆయనతో టచ్​లో ఉండడం లేదని తెలిసింది. తాజాగా భువనగిరిలో మీటింగ్ లో పలువురు ముఖ్యమైన లీడర్లకు జరిగిన అవమానం గురించి పార్టీలో చర్చ జరుగుతోంది.  

మండిపడుతున్న బీసీ లీడర్లు...

భువనగిరి టికెట్​బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన పార్టీ.. అదే వర్గానికి చెందిన లీడర్లను మాత్రం మీటింగ్​లకు పిలవడం లేదు. గొర్రెల కార్పొరేషన్​మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, కల్లుగీత కార్పొరేషన్​ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్​గౌడ్ తోపాటు మేడే రాజీవ్​సాగర్, సోమా భరత్​కుమార్​పార్టీ నేతల వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్​మాజీ చైర్మన్లుగా పనిచేసిన తాము కేసీఆర్​సైనికులుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించామని, తమ పదవులు పోవడంతో పార్టీలో గౌరవం తగ్గిపోయిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్​నియోజకవర్గాలకు చెందిన

ఈ మాజీ చైర్మన్లు బీఆర్ఎస్​ ప్రభుత్వంలో హల్​చల్​చేశారు. కానీ, ఇప్పుడు పదవులు కోల్పోవడంతో జిల్లా నేతలు వాళ్లను పట్టించుకోవడం లేదు. మునుగోడు నుంచి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిన మాజీ ఎమ్మె ల్సీ కర్నె ప్రభాకర్ కు సైతం మీటింగ్​లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మునుగో డు ఉపఎన్నికలప్పటి నుంచే ప్రభాకర్​ను పార్టీకి దూరంగా ఉంచారు. తాజాగా ఆ పరిస్థితి తమకు ఎదురైందని, ఫ్లెక్సీలో తమ ఫొటోలు కూడా ముద్రించలేదని ఆవేదన చెందుతున్నారు. ఎంపీ టికెట్​రేసులో ఉన్న ముఖ్యమైన వాళ్లలో జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఒకరు. ఆయన కూడా భువనగిరి మీటింగ్​కు రాపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

హైకమాండ్​కు తప్పుడు రిపోర్ట్​...

మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి తో విభేదించే లీడర్ల గురించి హైకమాండ్​కు తప్పుడు రిపోర్ట్​అందిస్తున్నారని, తమ రాజకీయ భవిష్యత్​ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని అంటున్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన విస్తృత స్థాయి మీటింగ్​కూడా అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన నేతలు రాలేదు. తమ అనుచరులుగా చలామణి అయ్యే వారిని మాత్రమే మీటింగ్​కు పిలిచారు. అసలుకే కొత్త అభ్యర్థులతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలని పార్టీ కేడర్ సందేహిస్తోంది. 

గుత్తా అమిత్ విషయం​లో తెరవెనక రాజకీయం..

అమిత్​కు నల్గొండ టికెట్​ఇవ్వాలని పార్టీ హైకమాండ్​ భావించింది. అయితే, పలువురు మాజీ ఎమ్మెల్యేలు అమిత్​పై అధిష్టానికి ఫిర్యాదు చేయడంతో అతడు వెనక్కితగ్గారని తెలిసింది. గుత్తా ఫ్యామిలీని రాజకీయం గా దెబ్బతీసేందుకు జగదీశ్ రెడ్డి వర్గం గట్టిగానే ప్రయత్నించిందని, దాంతోనే అమిత్​పోటీ చేయనని చెప్పారని ప్రచారం జరిగింది. కానీ, జగదీశ్ రెడ్డి వర్గం మాత్రం అమిత్​తనకు తానే పోటీ నుంచి తప్పుకున్నాడని, ఎంపీగా పోటీ చేయనని చెబితేనే కృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చిందని చెబుతోంది.

ఎన్ని కల్లో గుత్తావర్గం సపోర్ట్ పొందేందుకే ఈ తరహా ప్రచారం మొదలు పెట్టారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఇదిలావుంటే జడ్పీ చైర్మన్ బండా నరేందర్​రెడ్డి అనారోగ్యం కారణాలతో ఇంటికే పరిమితమయ్యారని చెపుతున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ ఇన్​చార్జిగా ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆయన కేటీఆర్​మీటింగ్​రాలేదని తెలిసింది. దీంతో కేటీఆర్ స్వయంగా నరేందర్​రెడ్డి ఇంటికి వెళ్లి రావడం మరింత చర్చకు దారితీసింది.