- వచ్చే ఏడాది నుంచి అమలుచేస్తామని మేయర్ వెల్లడి
వాషింగ్టన్: వచ్చే ఏడాది నుంచి దీపావళికి పబ్లిక్హాలిడే ఇవ్వనున్నట్లు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. దీపావళి పండుగ చరిత్రను, విశేషాలను పిల్లలు తెలుసుకోవడానికి ఇది తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. టైమ్స్ స్క్వేర్లో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తమ తమ ఇండ్లల్లో దీపాల పండుగను జరుపుకొన్నారు.
ఇండియన్ అమెరికన్లు గురువారం రాత్రి నుంచే టైమ్స్ స్క్వేర్-కు బయల్దేరారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, పార్లమెంటు సభ్యులు వారంపాటు వేడుకలు జరుపనున్నట్లు సమాచారం. దీపావళి వేడుకలకు వైస్ ప్రెసిడెంట్ నివాసానికి రావాలని ఇండియన్ -అమెరికన్లను, అంబాసిడర్లను హారిస్, ఆమె భర్త కలిసి ఆహ్వానించారు. సోమవారం వైట్-హౌస్లో జరపనున్న దీపావళి వేడుకలకు రావాలంటూ బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ కూడా వారికి ఆహ్వానం పంపారు.
వాషింగ్టన్లో కూడా దీపాల పండుగను జరపనున్నారు. దీనికి పార్లమెంటు సభ్యులు హాజరవుతారు. ఫ్లోరిడాలోని తన ఇంట్లో ట్రంప్ దీపావళి ఈవెంట్ ప్లాన్ చేశారు. దానికి రిపబ్లికన్ హిందూ కూటమికి చెందిన సుమారు 200 మంది ఇండియన్ -అమెరికన్లు హాజరవుతారు. శుక్రవారం రాత్రి నిర్వహించనున్న ఈవెంట్లో బాలీవుడ్ పాటలు, డ్యాన్స్-తో పాటు అతిథు-లకు మన దేశ వంటకాలను వడ్డిస్తారు. ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా తమ ఇండ్లల్లో విందు ఏర్పాటు చేసి గెస్టులను పిలిచి ప్రసంగించనున్నారు. న్యూయార్క్-లో త్వరలో మధ్యంతర ఎన్నికలు జరగనుండడంతో ఇండియన్ అమెరికన్లను ఆకర్షించేందుకు నేతలు పోటాపోటీగా దీపావళి వేడుకలు జరుపుతున్నారు.