- జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీపై చర్చ
హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీ విషయాన్ని చర్చించేందుకు ఎమ్మెల్సీ కవితతో డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) ప్రతినిధులు భేటీ అయ్యారు. మంగళవారం డీజేహెచ్ఎస్ అధ్యక్షుడు బొల్లోజు రవి, ఉపాధ్యక్షుడు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప తదితరులు కవితను కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తొలి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ డీజేహెచ్ఎస్ అని ప్రతినిధులు వివరించారు.
దశాబ్దాలుగా జర్నలిజంలో కొనసాగుతున్నవారు తమ సొసైటీలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని రాష్ట్రంలో జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీలకు ఇండ్ల స్థలాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
ఇటీవల మంత్రి కేటీఆర్ను కలిశామని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చిన విషయాన్ని డీజేహెచ్ఎస్ ప్రతినిధులు ఆమెకు గుర్తుచేశారు. తమకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ కవితను కోరారు. ఈ సందర్భంగా ఆమెకు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల ఇంటి కలను సాకారం చేయడంలో అండగా నిలుస్తానని కవిత భరోసా ఇచ్చారు.