
- సిటిజన్లకు పోలీసు ఉన్నతాధికారుల సూచన
- ఒమిక్రాన్ నేపథ్యంలో సేఫ్టీ ప్రికాషన్స్
- తీవ్రమైన నేరాల్లో పీఎస్కి వచ్చి ఫిర్యాదు చేయొచ్చంటున్న పోలీసులు
హైదరాబాద్/నేరెడ్మెట్/ జీడిమెట్ల వెలుగు: పోలీసులను కరోనా కలవరపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు1,400 మంది పోలీసులకు కరోనా రావడంతో డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ లో పోలీసుల్లో పాజిటివ్ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 500 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడగా.. సైబరాబాద్లో 150, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 110 మందికి వైరస్ సోకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు సీరియస్ క్రైమ్స్విషయంలో తప్ప బాధితులు కంప్లయింట్ చేసేందుకు పీఎస్కు రావొద్దని పోలీసులు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. దానికి బదులుగా ఆన్లైన్లో కంప్లయింట్ చేయాలంటున్నారు. కొన్ని పీఎస్ల పరిధిలో కంప్లయింట్స్ ఫైల్ చేయడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఒక్కరికే పర్మిషన్
కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న పీఎస్లలో కొవిడ్ గైడ్లైన్స్ కఠినంగా అమలు చేస్తున్నారు. స్టేషన్కి వచ్చే వారికి టెంపరేచర్ చెకప్,శానిటైజేషన్ తప్పనిసరి చేశారు. బాధితుల్లో ఒక్కరిని మాత్రమే పీఎస్ లోపలికి అనుమతిస్తున్నారు. వారి నుంచి కంప్లయింట్లు తీసుకునేందుకు పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేసి ముగ్గురు కానిస్టేబుళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. మాస్క్ లేకుండా వచ్చే వారిని పీఎస్ లోపలికి అనుమతించడం లేదు. మాస్క్ వయొలేషన్స్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన నేరాల్లో అవసరమైతేనే పీఎస్కి పిలిపిస్తున్నారు. బాధితుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ను విజిట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ను మానిటరింగ్ చేస్తున్నారు. ట్విట్టర్,వాట్సప్, ఫేస్బుక్లో వచ్చే పోస్ట్ల ఆధారంగా సంబంధిత పీఎస్ సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారి ఇండ్లకు పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ సిబ్బందిని పంపిస్తున్నారు. ఇంటి వద్దనే కంప్లయింట్ తీసుకుంటున్నారు. సీఐ ఆదేశాలతో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ కేసుల్లో ఆన్లైన్లో కంప్లయింట్లను తప్పనిసరి చేశారు. ఈ– మెయిల్స్ నుంచి వచ్చే కంప్లయింట్లతో బాధితులకు కాల్స్ చేస్తున్నారు. ఆన్లైన్ సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల్లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్సీసీఆర్పీ) నుంచి వచ్చే కంప్లయింట్స్ ఆధారంగా పోలీసులు కేసులు ఫైల్ చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్పరిధిలోని పోలీస్ స్టేషన్లలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సీపీ మహేశ్భగవత్ సూచించారు. సోమవారం నేరెడ్ మెట్లోని కమిషనరేట్ ఆఫీసులో అడిషనల్ సీపీ సుధీర్ బాబుతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సోకిన వారు ధైర్యంగా ఉంటూ డాక్టర్ల సూచనలు పాటించాలన్నారు. కాన్ఫరెన్స్లో అడిషనల్ డీసీపీ, సీపీ ఆఫీసు అడ్మిన్ నర్మద, ఆర్ఐ నాగరాజు రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ఆర్ఐ రవీందర్ పాల్గొన్నారు.
వారంలో మాస్క్ లేని 3,788 మందికి జరిమానా
ఎల్ బీనగర్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో మాస్క్ ధరించని 3,788 మందిపై రాచకొండ పోలీసులు కేసులు నమోదు చేశారు. రూ. 37 లక్షల 88 వేల ఫైన్ విధించారు. మాస్క్ లేకపోతే చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.