Diwali Special : దీపావళి ఐదు రోజుల పండగ అని.. ఎంత మందికి తెలుసు..!

Diwali Special : దీపావళి ఐదు రోజుల పండగ అని.. ఎంత మందికి తెలుసు..!

చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే పండుగ దీపావళి.  జీవితంలో అమావాస్య చీకట్లను పారదోలి వెలుగు జిలుగులు నింపుకొనే సంతోషాల సంబరమిది. ఈ తరంలో చాలామంది దీపావళి అంటే ఒక్కరోజు జరుపుకొనే పండుగే అనుకుంటారు. నిజానికి ఇది ఐదు రోజుల పాటు జరుపుకొనే  దీపావళి పండుగ  విశిష్టత గురించి తెలుసుకుందాం!

1 వరోజు...ధన త్రయోదశి  ( నవంబర్ 10, శుక్రవారం)

దేవదానవులు అమృతం కోసం మథించిన పాలకడలి నుంచి శ్రీమహాలక్ష్మీ ఉద్భవించింది. ఆమెను భార్యగా స్వీకరించిన శ్రీమహా విష్ణువు ‘ఐశ్వర్యానికి అధిదేవత’గా ప్రకటించాడు. ఇది ఆశ్వయుజ బహుళ త్రయోదశి (నవంబర్ 10) .  అందుకే దీన్ని ధన త్రయోదశి అంటారు. అందుకే ఆ రోజున కాస్తైనా బంగారం కొంటారు. లక్ష్మీ నివాస స్థానమైన విష్ణువు గుండెల మీద భృగుమహర్షి తన్నడంతో ఆమె అలిగి భూలోకంలోని కొల్హాపూర్‌కు చేరుతుంది.  ఆ అమ్మ భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు.

2 వ రోజు.. నరక చతుర్దశి   ( నవంబర్ 11, శనివారం)

 రెండో రోజు నరక చతుర్దశి. దీపావళి పండుగలో ప్రత్యేకమైనది దీపావళి అమావాస్య. ఈరోజు ప్రతి ఒక్కరూ తలస్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి.   దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసేవారికి సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం. లోక కంటకుడైన నరకాసుర సంహారం జరిగిన రోజు కాబట్టి ఇళ్లనూ, వాకిళ్లనూ అలంకరించి పూజలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. నవంబర్ 11న స్వాతీ నక్షత్రం .... నీటిలో గంగాదేవీ, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. విష్ణుమూర్తి బాలవటువు రూపంలో మూడు అడుగుల నేల అడిగి బలి చక్రవర్తిని పాతాళానికి అణిచేసిన రోజు కూడా ఇదేనని చెబుతారు.

3 వ రోజు... దీపావళి అమావాస్య   ( నవంబర్ 12, ఆదివారం)

కృత యుగం ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు దీపావళి. త్రేతాయుగం ప్రకారం శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు ప్రయాణం చేసిన రోజు దీపావళి. ద్వాపరయుగ ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వచ్చిన రోజు దీపావళిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి. నవంబర్ 12 న కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే మంచిది.  లక్ష్మీపూజ తర్వాత కొత్త దస్త్రాలూ, ఖాతా పుస్తకాలూ తెరవడం ఆచారం. సాయంత్రం ఏ ఇల్లు ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరించి ఉంటుందో.. ఆ ఇంటసిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మీ దేవి అడుగు పెడుతుందని భక్తుల నమ్ముతుంటారు

4వ రోజు... బలి పాడ్యమి   ( నవంబర్ 13, సోమవారం)

దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్‌’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే.

5వ రోజు.. భగిని హస్త భోజనం  ( నవంబర్ 14, మంగళవారం)

నవంబర్ 14  రోజును భాయిదూజ్‌గా జరుపుకుంటారు. మగవారు అక్కాచెల్లెళ్ల చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. దీనికి సంబంధించి అద్భుతమైన కథ ప్రాచుర్యంలో ఉంది. సూర్యభగవానుని కుమారుడు యముడు, అతడి సోదరి యమి/యమున. ఈమె తన సోదరుణ్ని ఎంతో అభిమానించేది. నిత్యమూ అతని మిత్రులతో సహా వచ్చి తన ఇంట్లో విందు చేసి పొమ్మని ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దానికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది. కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి స్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా చేసిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సంతోషాంతరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది..

ALSO READ :మ్యూజిక్లో సెంచరీ అంటే.. ఇది మామూలు మ్యాజిక్ కాదు గురు