నిజామాబాద్ జిల్లాలో 2,510 టన్నుల .. దొడ్డు బియ్యం పురుగులపాలు

నిజామాబాద్ జిల్లాలో 2,510 టన్నుల .. దొడ్డు బియ్యం పురుగులపాలు
  • దొడ్డు రైస్​నిల్వ మార్కెట్ విలువ 
  • రూ.7.53 కోట్లకు పైనే..మరోచోటుకు తరలించేందుకు అందని అనుమతులు

నిజామాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ ప్రారంభించాక అప్పటికే ఉన్న దొడ్డు బియ్యం ఎక్కడికి తరలించాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.  నిజామాబాద్​ జిల్లాలోని తొమ్మిది ఎంఎల్​ఎస్ పాయింట్స్​, 759 రేషన్ షాపుల్లో ఉన్న సుమారు 2,510 మెట్రిక్​ టన్నుల బియ్యానికి పురుగు పట్టింది. కళ్లెదుటే బియ్యం పాడవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వ ఆదేశాల కోసం ఆఫీసర్లు ఎదురుచూస్తున్నారు.  ఆలస్యం చేస్తే  బియ్యం తినడానికి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది.

బియ్యం నిల్వపై నిర్లక్ష్యం..

జిల్లాలో 4,02,217 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.  13,10,012 లక్షల మందికి ప్రతి నెలా ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తోంది.  ఇందుకు అవసరమైన 8,733 టన్నుల బియ్యం కోటా ప్రతి నెలా జిల్లాలోని ఎఫ్​సీఐ గోదాంల నుంచి ఎంఎల్​ఎస్​ పాయింట్లకు చేర్చి అక్కడి నుంచి 759 రేషన్​ షాపులకు పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని ఏ రేషన్​ షాపు నుంచైనా బయోమెట్రిక్​ ద్వారా బియ్యం తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వలస వెళ్లినవారు రైస్​ తీసుకోడానికి వీలుగా 20 శాతం బియ్యాన్ని డీలర్ల వద్ద సివిల్​ సప్లయ్​ శాఖ నిల్వ ఉంచుతుంది. ఆన్​లైన్ సెంట్రల్ మానిటరింగ్ సిస్టం ద్వారా ఆ లెక్కలు ప్రతి నెలా సేకరించి క్లోజింగ్​ బ్యాలెన్స్​, ఓపెనింగ్ స్టాక్​ లెక్కలు రాస్తారు. 

ఈ రకంగా మార్చి నెలకు జిల్లా డీలర్ల వద్ద 510 టన్నులు, ఎంఎల్​ఎస్​ పాయింట్​లలో 2 వేల టన్నుల ఫోర్టిఫైడ్​ మిక్స్​డ్​ దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి.  ఏప్రిల్​ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయగా, లబ్ధిదారులు వరసకట్టి తీసుకెళ్తున్నారు. మూడు నెలల నుంచి అవి వచ్చినవి వచ్చినట్లు ఖాళీ అవుతున్నాయి. ఈనెల మూడు నెలల రైస్ పంపిణీ చేయగా రేషన్​ షాపులకు జనం క్యూ కొనసాగుతోంది. మూలన పడేసిన దొడ్డు బియ్యం బ్యాగ్​లు ఎక్కడికి పంపాలో తెలియక డీలర్లు అయోమయానికి గురవుతున్నారు.

గోదాముల్లోనే భద్రత.. 

గోదాముల్లో నిల్వ చేసే బియ్యం నాణ్యంగా ఉంటాయి. గాలి, వెలుతురు తగిలేలా భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. ఎంఎల్​ఎస్​ పాయింట్లలో కూడా భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. చిన్న రూమ్​లలో సాగే డీలర్​షాపుల్లో ఎలాంటి భద్రత ఉండకపోవడంతో పురుగుపట్టి క్వాలిటీ దెబ్బతింటున్నది.  ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో నిమ్ము వచ్చి బియ్యం బస్తాలు పాడవుతున్నాయి. ప్రభుత్వ ధర ప్రకారం బియ్యం  విలువ రూ.5.84 కోట్లు కాగా, మార్కెట్​లో రూ.7.53 కోట్ల పైగానే విలువ ఉంటుంది. బియ్యం పురుగుపట్టి నాణ్యత కోల్పోతే తమను బాధ్యులను చేస్తారేమోనని డీలర్లు,  ఎంఎల్​ఎస్ పాయింట్ల ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని మరోచోటుకు తరలించాలని కోరుతున్నారు. 

ప్రభుత్వానికి లెటర్ రాశాం..

జిల్లాలో మిగిలిన దొడ్డు బియ్యం విషయమై ప్రభుత్వానికి  లెటర్​ రాశాం. ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. రైస్​కు పురుగుపట్టి నాణ్యత కోల్పోతుండడం వాస్తవమే. వాటిని ఎక్కడికి తరలించాలో ఆర్డర్స్​ వచ్చేదాకా ఏమి చేయలేం. 

అరవింద్​రెడ్డి, డీఎస్​వో, సివిల్ సప్లయ్​