- జర్నలిస్టుల అరెస్టును ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: మహిళా ఐఏఎస్ అధికారిపై వార్తల కేసులో విచారణ పూర్తయ్యాక తప్పొప్పులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంతేకానీ, ఇలా ముందుగానే అరెస్టు చేయ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం లేదా? లేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా?’’ అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, నిష్పక్షపాతంగా సిట్తో విచారణ జరిపించాలన్నారు.
‘‘జర్నలిజం పట్ల, జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికం. ఓ న్యూస్ రిపోర్ట్ విషయంలో తలెత్తిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 మంది సభ్యుల స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్) ఇంకా విచారణ జరుపుతూనే ఉంది. ఇంతలోపే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జర్నలిస్టుల ఇండ్లపై దాడి చేసి, ఇంటి తలుపులు ధ్వంసం చేసి వారిని అరెస్టు చేయడం అత్యంత దురదృష్టకరం’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
