జూలూరుపాడు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే అప్పగించాలని బుధవారం ఇద్దరు మహిళా లబ్ధిదారులు సర్పంచ్ ఇంటి ముందు పురుగు మందు తాగారు. వివరాలిలా ఉన్నాయి. తమకు కేటాయించిన ఇండ్లను ఆక్రమించినవారిని తొలగించాలని సర్పంచ్ బాదావత్ లక్ష్మి ఇంటి ముందు లబ్ధిదారులు భుక్యా జమిలి, ధారావత్ శాంతి, మరికొందరు బైఠాయించారు. ఎంతసేపటికీ సర్పంచ్ నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో సహనం కోల్పోయిన జమిలి, శాంతి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఎటువంటి ప్రాణహాని లేదని డాక్టర్లు చెప్పారు. మిగిలిన లబ్ధిదారులను సీఐ వసంత్ కుమార్, తహసీల్దార్ శారద ముందు సమావేశ పరిచారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించి, అర్హులైన వారికి ఇండ్లను అప్పగించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.