పుష్ప స్టయిల్‌‌లో సిమెంట్ లోడ్ మధ్య 1200 కేజీల గంజాయి తరలింపు

పుష్ప స్టయిల్‌‌లో సిమెంట్ లోడ్ మధ్య  1200 కేజీల గంజాయి  తరలింపు

ఎల్బీనగర్, వెలుగు: పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డీసీఎం వ్యాన్​లో సిమెంట్ బ్యాగుల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ సెల్​లో రూ.6.25 కోట్ల విలువైన 1,210 కేజీల గంజాయిని దాచి రవాణ చేస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్, మహేశ్వరం ఎస్ వోటీ పోలీసులు కలిసి పట్టుకున్నారు. గంజాయిని ఒడిశా నుంచి రాజస్థాన్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. ఎల్బీనగర్ లోని సీపీ క్యాంప్ ఆఫీస్​లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు ఈ కేసుకు సంబంధించిన వివరాల వెల్లడించారు.

 రాజస్థాన్ లోని జోధ్​పూర్​కు చెందిన విక్రమ్ అలియస్ వికాస్ (22) డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రాజస్థాన్ కు చెందిన దేవిలాల్, ఆయుబ్ ఖాన్, రామ్ లాల్ స్థానికంగా గంజాయి సప్లై నెట్​వర్క్​ను నడిపిస్తున్నారు. ఒడిశా నుంచి రాజస్థాన్ కు గంజాయి తీసుకొస్తే ట్రక్కు లోడ్ కు రూ.5 లక్షలు ఇస్తామని విక్రమ్ కు చెప్పారు. అందుకు ఒప్పుకున్న విక్రమ్.. రాజస్థాన్ నుంచి ఐరన్ లోడ్ తో మహారాష్ట్ర నాందేడ్ కు వెళ్లాడు. అక్కడ ఐరన్ అన్​లోడ్ చేసి హైదరాబాద్ మీదుగా ఖమ్మం చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఖమ్మంలో సిమెంట్ బస్తాలు నింపుకుని ఒడిశాలోని మల్కన్ గిరి వెళ్లాడు. అక్కడ 1,210 కిలోల గంజాయి కొని సిమెంట్ బస్తాల కింద ఏర్పాటు చేసుకున్న సీక్రెట్ సెల్​లో దాచాడు. హైదరాబాద్ మీదుగా రాజస్థాన్​కు బయల్దేరాడు. పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం విజయవాడ నేషనల్ హైవేపై కొత్తగూడెం చౌరస్తాలో పోలీసులు ఆ డీసీఎంను అడ్డగించారు. వెహికల్​ను తనిఖీ చేయగా.. సిమెంట్ సంచుల మధ్యలో 70 బ్యాగుల్లో 1,210 కేజీల గంజాయిని గుర్తించారు. విక్రమ్ ను విచారించగారాజస్థాన్ కు చెందిన దేవిలాల్, ఆయుబ్ ఖాన్, రామ్ లాల్ కు గంజాయి డెలివరీ ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. కీలక నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీపీ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ పరిధిలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి సీజ్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ మొహ్మద్ షకీర్ హుస్సేన్, ఏసీపీ పి.సత్తయ్య, సీఐ రవికుమార్, అబ్దులాపూర్ మెట్ సీఐ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.