ఓల్డ్సిటీ, వెలుగు: ఫుల్లుగా తాగాడు.. ఇంట్లోకి దూరాడు.. రెండు సెల్ఫోన్లు, ఇతర వస్తువులు తీసుకెళ్లేందుకు సర్దుకుని రెడీ అయ్యాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఫుల్లుగా మద్యం తాగడంతో మత్తు ముంచుకొచ్చింది. దీంతో బయటకు ఎలా వెళ్లాలో అర్థం కాక అదే ఇంట్లో హాయిగా నిద్రపోయాడు. ఈ ఘటన గురువారం చాంద్రాయణగుట్ట షాహీన్నగర్లోని వాడి ఇ ముస్తఫా బస్తీలో జరిగింది.
స్థానికుడైన మహమ్మద్ షోయబ్ మద్యం మత్తులో మహమ్మద్ ఎజాజుద్దీన్ ఇంట్లోకి చొరబడి చోరీ చేశాడు. ఆ తర్వాత మద్యం మత్తు ఎక్కువ కావడంతో అక్కడే నిద్రపోయాడు. తెల్లవారుజామున ఇంటి యజమానులు నిద్ర లేచి చూడగా.. ఇంట్లో ఓ వ్యక్తి పడుకొని ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
