
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచాలనే ఆలోచన విరమించుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలేజీల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోయినా, టీఏఎఫ్ఆర్సీ ఫీజులు పెంచాలనే ప్రతిపాదనలు ఇవ్వాలనే ఆలోచన సరికాదని చెప్పారు. బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తంను కలిసి వారు వినతిపత్రం అందించారు.
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్లు వ్యాపార ధోరణితో కాలేజీలను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. కాలేజీలు తప్పుడు లెక్కలు ఇచ్చి, టీఏఎఫ్ఆర్సీని కూడా మోసం చేస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులపై భారం వేయొద్దని ప్రభుత్వం ఫీజులు పెంచొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జావిద్, రాష్ట్ర నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.