ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర సిట్ విచారణ కొనసాగుతుండగానే.. మరోవైపు ఈడీ దూకుడు పెంచింది. మొయినాబాద్ ఫాం హోస్ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ఈడీ అధికారులు ECIR నమోదు చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఈడీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని రెండు రోజుల పాటు విచారించారు. మరోవైపు అభిషేక్ ఆవులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడైన నందకుమార్ ను విచారించేందుకు ఈడీ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత్రపై నందకుమార్ ను అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ రెడ్డిని విచారించిన ఈడీ ఆయన బ్యాంకు లావాదేవీలతో పాటు.. కుటుంబసభ్యుల బ్యాంకు అకౌంట్లను ఈడీ అధిరులు పరిశీలించారు. ఈనెల 27న మరోసారి విచారణకు హాజరుకావాలని రోహిత్ రెడ్డికి చెప్పారు.

