- టార్చ్ లైట్ చూసి పోలీసులు వస్తున్నారని పరుగు
- గుడిరేవు గోదావరిలో మునిగి వ్యక్తి మృతి
- తొమ్మిది రోజులకు దొరికిన డెడ్ బాడీ
దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ సమీపంలో 9 రోజుల కింద అదృశ్యమైన దండేపల్లి మండలం నాగసముద్రానికి చెందిన గూడ మల్లేశ్(43) కథ విషాదాంతమైంది. అతడి డెడ్బాడీ దండేపల్లి మండలంలోని గోదావరి నది తీరంలో శనివారం దొరికింది. మల్లేశ్ ఈనెల 16న రాత్రి తిమ్మాపూర్ లోని రామాలయం సమీపంలో కొంత మందితో కలిసి పేకాట ఆడుతున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు టార్చ్లైట్ వేయడంతో పోలీసులు వచ్చారనే భయంతో అంతా పరుగులు పెట్టారు.
కొద్దిసేపటికి పోలీసులు కాదని నిర్ధారించుకొని మళ్లీ అంతా ఒకచోటకు చేరారు. కానీ, మల్లేశ్ మాత్రం రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో మల్లేశ్ భార్య సుజాత 18న జన్నారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. శనివారం దండేపల్లి మండలం గుడిరేవు వద్ద డెడ్ బాడీ లభించింది. భయంతో పారిపోతూ ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయి చనిపోయినట్లు తెలుస్తోంది.

