అక్రమ మైనింగ్ వ్యవహారం : ఛత్తీస్ గఢ్ సీఎం డిప్యూటీ సెక్రెటరీని అరెస్ట్ చేసిన ఈడీ

అక్రమ మైనింగ్ వ్యవహారం : ఛత్తీస్ గఢ్ సీఎం డిప్యూటీ సెక్రెటరీని అరెస్ట్ చేసిన ఈడీ

ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ డిప్యూటీ సెక్రెటరీ సౌమ్య చౌరాసియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. రాష్ట్రంలోని బొగ్గు గనుల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరిగేలా సహకరించారనే అభియోగాలను ఆమె ఎదుర్కొంటున్నట్లు ఈడీ తెలిపింది. ఇదే విషయమై  ఇప్పటికే ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సౌమ్య చౌరాసియాకు చెందిన పలు ఆస్తులను అటాచ్ చేసింది. బొగ్గు గనుల్లో అక్రమ మైనింగ్ కు అనుమతుల వ్యవహారంపై గత రెండు నెలల్లో పలుమార్లు సౌమ్యను ప్రశ్నించిన ఈడీ తాజాగా ఇవాళ అరెస్టు చేసింది.

2002 మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆమెను అరెస్టు చేశామని వెల్లడించింది. రాష్ట్రంలోని పలు బొగ్గు గనుల్లో పరిమితికి మించిన స్థాయిలో మైనింగ్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఒక్కో టన్ను బొగ్గుపై అదనంగా 25 రూపాయలు పన్నును అక్రమంగా వసూలు చేశారని.. ఈ వసూళ్ల బాగోతంలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంలోని సీనియర్ బ్యూరోక్రాట్లు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, దళారుల హస్తం ఉందని ఐటీ శాఖ అభియోగాలను దాఖలు చేసింది. ఈమేరకు ఐటీ శాఖ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును ప్రారంభించింది.