
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఫోన్ల చుట్టే ఈడీ విచారణ తిరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం లేదా మార్చినట్టుగా ఈడీ అధికారులు అభియోగాలు మోపారు. స్కామ్ లో 36 మందిని నిందితులు, అనుమానితులుగా గుర్తించిన ఈడీ...వారంతా 170 ఫోన్లు వాడినట్టుగా తెలిపారు. అయితే ఇప్పటివరకు కేవలం 17 ఫోన్లు మాత్రమే ఈడీ అధికారులు రికవరీ చేశారు . మిగతా ఫోన్ల ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. మరోవైపు రెండోవ రోజు ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు కవిత ఓ ప్లాస్టిక్ కవర్లో పాత ఫోన్లను మీడియాకు చూపించారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు కూడా మీడియాకు ఫోన్లు చూపిస్తూ కవిత లోపలికి వెళ్లారు. ప్రధానంగా ఈడీ అధికారులు ఆమెను ఫోన్ల చుట్టే ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.
ఈడీకి కవిత లేఖ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్కు లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని కవిత లేఖలో పేర్కోన్నారు. తనపై ఈడీ తప్పుడు ప్రచారం చేస్తుందని , దురుద్దేశ్యంతో వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. అందుకే తన పాత ఫోన్లన్నీ ఇచ్చేస్తున్నానని పేర్కొన్నారు. నవంబర్ లోనే తాను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ప్రచారం చేసిందని, ఏ ఉద్దేశ్యంతో ఇలా చేశారని కవిత ఈడీని ప్రశ్నించారు. మహిళల ఫోన్లు స్వాధీనం చేసుకోవడం అంటే స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందన్నారు. ఫోన్ల విషయంలో కనిసం సమన్లు కూడా ఇవ్వలేదని కవిత తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను విచారణకు సహకరిస్తున్నానని కవిత తెలిపారు. మార్చి21న రెండోరోజు ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు తన ఫోన్లను మీడియాకు చూపించారు.