
న్యూఢిల్లీ: ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారి నుంచి రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ను గురువారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈడీ అధికారులు ఆగస్టు 3, 4 తేదీల్లో నగల వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో నగల వ్యాపారి కొడుకుకు అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్ యాదవ్ ఫోన్ చేసి రూ.25 లక్షలు ఇవ్వాలని, లేకుంటే అరెస్ట్ చేస్తామని బెదిరించాడు.
చివరకు రూ.20 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి కొడుకు ఒప్పుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని వ్యాపారి కొడుకు సీబీఐని ఆశ్రయించాడు. ఈ క్రమంలో వ్యాపారి కొడుకు నుంచి సందీప్ సింగ్ యాదవ్ లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.