రోహిత్ రెడ్డిని 8 గంటలు ప్రశ్నించిన ఈడీ

రోహిత్ రెడ్డిని 8 గంటలు ప్రశ్నించిన ఈడీ

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని రెండో రోజు మంగళవారం ఈడీ విచారించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విచారణ జరిపింది. 2015 నుంచి రోహిత్‌‌‌‌రెడ్డికి చెందిన బ్యాంక్ అకౌంట్స్, వ్యాపార లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు తెలిసింది. ఫామ్ హౌస్ కేసుకు సంబంధించిన వివరాలనూ తెలుసుకున్నట్లు సమాచారం. ఈ నెల 27న మరోసారి విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. విచారణ తర్వాత రోహిత్‌‌‌‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఫామ్ హౌస్ కేసులో తనను విచారించారని చెప్పారు. ‘‘ఇది కేవలం ఫామ్ హౌస్ కేసేనని అధికారులు చెప్పారు. ఈ కేసులో నేను ఫిర్యాదుదారుడిని. నేను దీక్షలో ఉన్నా నన్ను ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అయినప్పటికీ, నా వ్యక్తిగత వివరాలు సేకరించారు. నా ఫ్యామిలీ వివరాలు, వ్యాపారాలు, విదేశీ టూర్ల సమాచారం తీసుకున్నారు’’ అని తెలిపారు.