
- నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. బుధవారం బ్యాంక్ చైర్మన్, ఎండీ, డైరెక్టర్లకు చెందిన ఇండ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. బంజారాహిల్స్లోని బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ సహా చైర్మన్ రమేశ్ కుమార్ బగ్, ఎండీ ఉమేషన్ చంద్ అస్వా, వైస్ చైర్మన్ పురుషోత్తం మందన, సోలిపురం వెంకట్రెడ్డి మరో ఇద్దరు డైరెక్టర్ల ఇండ్లు, ఆఫీసులు సహా మొత్తం 10 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. నగదు, కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు.
పలు బ్యాంక్ లాకర్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలకు సంబంధించిన వివరాలను గురువారం వెల్లడించనున్నారు. ఫేక్ డాక్యమెంట్లతో బ్యాంక్ షేర్ హోల్డర్లకు చెందిన డిపాజిట్లలో రూ.300 కోట్లకు పైగా అనర్హులకు రుణాలు మంజూరు చేయడం, బ్యాంకు నుంచి రూ.18.30 కోట్లు దారి మళ్లించారనే ఆరోపణలతో గతంలో బంజారాహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది. బ్యాంక్ షేర్ హోల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్యామ్సుందర్ బియాని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. మనీలాండరింగ్, హవాలా లావాదేవీల వివరాలు సేకరించారు. ఇందులో భాగంగానే సోదాలు నిర్వహించారు.