హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తో సహా పలుచోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది ఈడీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.
ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దాడులు సోదాలు జరుగుతున్నాయి. దీంతో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. కవిత సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత రెండు సార్లు ఈడీ ముందు హాజరయ్యారు.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఈడీ విచారణను తప్పుబడుతూ గతంలో కవిత పిటిషన్ వేశారు. మహిళలను తమ ఇంట్లోనే విచారించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంను కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. మరోవైపు పలుమార్లు కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినా ఆమె విచారణకు హాజరుకాలేదు.