బీజేపీని ఆపడం కేసీఆర్ జేజమ్మ వల్ల కూడా కాదు

బీజేపీని ఆపడం కేసీఆర్ జేజమ్మ వల్ల కూడా కాదు

బీజేపీ ప్రభంజనాన్ని ఆపడం కేసీఆర్ జేజమ్మ వల్ల కూడా కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ను పాతరేసి, సీఎం కేసీఆర్ దోచుకున్న లక్షల కోట్లను కక్కిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదని, ఆయనో పెద్ద అబద్దాలకోరని ఈటల విమర్శించారు.  ప్రజల చెమట బిందువులను దోచుకుతిన్న కేసీఆర్ తత్వమేంటో జనాలకు ఇప్పుడు అర్థమైందని అన్నారు. ఐదేళ్లు గడిచినా కేసీఆర్ సర్కారు కొత్త పింఛన్ల ఊసే ఎత్తడంలేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్లో తనను ఓడించేందుకు అమలుచేసిన దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలుచేయాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలో అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కారుదని ఈటల ఆరోపించారు. మద్యానికి బానిసైన రాష్ట్రంగా తెలంగాణను మార్చారని మండిపడ్డారు. ప్రజలు అసహ్యించుకుంటున్నా.. రూ.33 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టుకున్నాడని విమర్శించారు. కేసీఆర్ ఫొటో ఫ్లెక్సీల్లో ఉంటే.. మోడీ జనం గుండెల్లో ఉన్నారని ఈటల అభిప్రాయపడ్డారు. బుడ్డపార్టీ టీఆర్ఎస్ కు బీజేపీని ఆపే శక్తి లేదని అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే కేసీఆర్ కు వేసినట్లేనన్న ఈటల..  అందుకు రాహుల్ గాంధీ, కేటీఆర్ చెట్టాపట్టాలేసుకుని తిరగడమే నిదర్శనమని అన్నారు. బీజేపీకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసన్న ఆయన.. జులై 3న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.