
- ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’ ర్యాలీతో పిల్లలకు వెల్కమ్
- స్కూళ్ల తరహాలో బెల్ ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: ఎండాకాలం సెలవులు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం అంగన్వాడీ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. అమ్మ మాట–అంగన్వాడీ బాట బ్యానర్లతో ర్యాలీలు తీశారు. అంగన్వాడీ సెంటర్ల వద్ద చిన్నారులకు టీచర్లు, హెల్పర్లు స్వాగతం పలికారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తొలిరోజు పిల్లలకు లంచ్లో ప్రత్యేకంగా ‘ఎగ్ బిర్యానీ’ వడ్డించారు. ప్రతిరోజూ ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీలైన చోట్ల చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటున్నది.
ఈ తరహా పోషకాహారం అందించడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్లు, హాజరు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, అంగన్వాడీ చిన్నారులు, సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, ఉత్సాహం పెంచేందుకు అన్ని సెంటర్లలో తొలిసారి బెల్ను ఏర్పాటు చేశారు. అలాగే, హైదరాబాద్లోని పలు అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు వందన, ప్రేమలత సందర్శించారు. కాచిగూడలోని సత్యానగర్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. రహమత్నగర్లో సెంటర్ను మహిళా, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ ప్రారంభించారు. సెల్ఫీ ఇన్ అంగన్వాడీ కార్యక్రమంలో భాగంగా చిన్నారులతో పేరెంట్స్ ఉత్సాహంగా సెల్ఫీ లు తీసుకున్నారు.