వేములవాడ రాజన్న గోశాలలో ఎనిమిది కోడెలు మృతి

వేములవాడ రాజన్న గోశాలలో ఎనిమిది కోడెలు మృతి

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి చెందిన గోశాలలో ఉన్న 8 కోడెలు శుక్రవారం చనిపోయాయి. మూడు రోజుల కింద వర్షం పడడంతో గోశాల పూర్తిగా బురదమయంగా మారడంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు వర్షంలో తడవడంతో కోడెలు అనారోగ్యం బారిన పడ్డాయి. ఈ కారణం వల్లనే ఎనిమిది కోడెలు మృతి చెందాయని తెలుస్తోంది. చనిపోయిన కోడెలను ట్రాక్టర్‌‌లో తీసుకెళ్లి మూలవాగులో పూడ్చిపెట్టారు. కోడెల మృతి విషయం తెలుసుకున్న కలెక్టర్‌‌ వెంటనే వెటర్నరీ సిబ్బందిని గోశాలకు పంపించారు. అనారోగ్యంతో ఉన్న మిగతా కోడెలకు ట్రీట్‌‌మెంట్‌‌ అందించారు.

గోశాలలో కెపాసిటీకి మించి కోడెలు

తిప్పాపూర్‌‌లో ఉన్న రాజన్న గోశాలలో 500 కోడెల సంరక్షణకు మాత్రమే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 1200పైగా కోడెలు ఉండడం ఇబ్బందిగా మారింది. గోశాలలో ప్రస్తుతం 24 మంది షిఫ్ట్‌‌ల వారీగా పనిచేస్తున్నారు. అయితే కోడెల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో వాటి సంరక్షణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

కోడె మొక్కుల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని భక్తులు మండిపడుతున్నారు. కోడెలు ఎక్కువ సంఖ్యలో ఉంటే అర్హులైన రైతులను గుర్తించి పంపిణీ చేయాల్సి ఉండగా.. ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్‌‌ స్పందించి కోడెలను రైతులకు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు.