- మరో ఆరుగురికి గాయాలు
- రెండు ఇళ్లు పాక్షికంగా ధ్వంసం
- ఉత్తర్ ప్రదేశ్ లోని గోండా జిల్లా టిక్రి గ్రామంలో ఘటన
గోండా(ఉత్తరప్రదేశ్): ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లా టిక్రి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుందీ ఘటన. ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. నురుల్ హుసేన్ అనే వ్యక్తి ఇంట్లో నిన్న రాత్రి వంట చేస్తున్న సమయంలో ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి పెద్ద ఎత్తున శబ్దం చేస్తూ పేలిపోయింది. ఈ దెబ్బకు ఇంటి పైకప్పు విరిగి పడగా..పక్కనున్న మరో ఇంటి పైకప్పు కూడా కూలిపోయింది.
ఈ రెండు ఇళ్లు కూలిపోవడంతో శిధిలాల కింద 15 మంది చిక్కుకుని ఆర్తనాదాలు చేశారు. పేలుడు ధాటికి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో పాటు నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడి చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సహాయక సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై గోండా జిల్లా ఎస్పీ సంతోష్ మిశ్రా మాట్లాడుతూ వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు జరిగినట్లు గుర్తించామన్నారు. వాస్తవాలు నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరించామన్నారు. కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణాన్ని కచ్చితంగా నిర్ధారించుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రమాదంపై సీఎం యోగి దిగ్భ్రాంతి
గ్యాస్ సిలిండర్ ఇంట్లో వంట చేస్తున్న సమయంలో పేలుడు జరిగి ఏకంగా 8 మంది చనిపోవడం మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి స్పందించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సామాన్య మధ్య తరగతికి చెందిన రెండు కుటుంబాలు ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతినడం. ప్రాణ నష్టంతో పాటు ఆర్ధికంగా నష్టపోవడం కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. గాయపడిన వారికి మంచి మెరుగైన చికిత్స అందించి కోలుకునేలా చూడాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను అన్ని విధాలుగా అదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.