తోడికోడళ్ల లొల్లి.. తాగొచ్చి తమ్ముడిని చంపిన అన్న

తోడికోడళ్ల లొల్లి.. తాగొచ్చి తమ్ముడిని చంపిన అన్న

హైదరాబాద్ లో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. తాగిన మైకంలో సొంత తమ్ముడినే కత్తితో పొడిచి చంపాడు ఓ అన్న. నిత్యం తన భార్యతో తమ్ముడి భార్య గొడవ పడుతోందన్న కారణంతో ఆవేశంలో తమ్ముడిని కడతేర్చాడు.

సిటీలోని అసిఫ్ నగర్ స్టేషన్ పరిధిలో ఉన్న కిషన్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్ముద్ మహబూబ్, తమ్ముడు తయ్యబ్ తమ భార్య పిల్లలతో ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే పెద్ద వాడైన మహాబూబ్ భార్యతో తమ్ముడు తయ్యబ్ భార్యకు మధ్య పడేది కాదు. దీంతో తన తమ్ముడిని హెచ్చరించాడు. అతని భార్యకు నచ్చ చెప్పి గొడవలు పడకుండా చూడాలని చెప్పాడు. కానీ అదే పనిగా తోడికోడళ్లిద్దరూ రోజూ ఇంట్లో గొడవలు పడేవారు. తమ పిల్లల ముందే ఆ ఇద్దరూ నోటికొచ్చినట్లు తిట్టుకుంటూ రచ్చ చేసేవారు. కుటుంబంలో నిత్యం ఈ కలహాలతో విసిగిపోయాడు మహాబూబ్.

పెళ్లాన్ని అదుపులో పెట్టుకోలేవా అంటూ..

తమ్ముడిని చంపిన అన్న మహబూబ్

ఆదివారం రాత్రి ఫుల్ గా తాగి వచ్చిన మహబూబ్ ఇంట్లో ఉన్న తమ్ముడితో గొడవకు దిగాడు. పెళ్లాన్ని అదుపులో పెట్టుకోలేవా, రోజూ ఇంట్లో రచ్చ ఏంటి అంటూ అరిచాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి.. కొట్టాటదాకా పోయింది. తాగిన మైకంలో ఉన్న మహబూబ్ ఆవేశంలో తమ్ముడిని కత్తితో పొడిచాడు.

క్షణాల్లో తయ్యబ్ రక్తపు మడుగులో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా షాక్ కు గురైన కుటుంబసభ్యులు తేరుకుని అతడిని ఉస్మానియా హాస్సిటల్ తీసుకెళ్లారు. కానీ, తయ్యబ్ దారిలోనే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మహబూబ్ ను అదుపులోకి తీసుకున్నారు.