మాదిగలను చిన్నచూపు చూస్తున్నరు : రఘునందన్​రావు

మాదిగలను చిన్నచూపు చూస్తున్నరు : రఘునందన్​రావు
  •     కేసీఆర్​ మంత్రి వర్గంలో మాదిగలకు చోటు లేదు
  •     ఎమ్మెల్యే రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు : రాష్ట్రంలో 23 శాతం ఉన్న ఎస్సీలకు కేసీఆర్​ మంత్రి వర్గంలో చోటు లేదని, మాదిగ ప్రజాప్రతినిధులను చిన్న చూపు చూస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్​రావు ఆరోపించారు. ఆదివారం అక్భర్​పేట-భూంపల్లి మండలం రుద్రారం, చౌదర్​పల్లి, ఎనగుర్తి, బొప్పాపూర్​, రాయపోల్​ మండలం టెంకంపేట, బేగంపేట, ఎల్కల్​ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలతో ఎన్నికల ప్రచారానికి వస్తున్న బీఆర్ఎస్​ నాయకులను నిలదీయాలన్నారు.

జనాభాలో ఎస్సీలు 23 శాతం ఉంటే మంత్రి వర్గంలో ఒక్కరికే అవకాశం ఇచ్చారని, ఒక్క శాతం ఉన్న సీఎం కులానికి మాత్రం 5 మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. డబుల్​బెడ్రూమ్‌లు, దళిత, బీసీ, మైనార్టీ బంధులను బీఆర్ఎస్​ కార్యకర్తలకే పంపిణీ చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వైన్స్​టెండర్లపై ఉన్న చిత్తశుద్ధి ఉద్యోగ నోటిఫికేషన్లపై లేదని విమర్శించారు.  పదేండ్లుగా కొత్త రేషన్​ కార్డులను జారీ చేయలేదని, వీటి గురించి అసెంబ్లీలో మాట్లాడితే కేసీఆర్​ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తాను గెలిచిన తర్వాత దుబ్బాకలో డబుల్​ బెడ్రూమ్​లను పంపిణీ చేసి

నూతన బస్టాండ్​ఆధునాతన పద్దతుల్లో నిర్మించానన్నారు. అక్భర్​పేట-భూంపల్లి నూతన మండలంగా చేశానని, ఇదే మండలం మీదుగా జాతీయ రహదారిని తీసుకొచ్చానని చెప్పారు. అమాసకోసారి, పున్నానికోక్కసారి వచ్చే ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి కావాలో, నిరంతరం ప్రజల మధ్యనే ఉండే రఘునందన్​రావు కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. దుబ్బాకకు వచ్చిన నిధులను మంత్రి హరీశ్​రావు అడ్డదారిలో సిద్దిపేటకు తరలించుకపోయారని, ఎంపీ నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్​లో పెట్టారని ఆరోపించారు. కమలం పువ్వుకు ఓటేసి మరొకసారి దుబ్బాక ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని పిలుపు నిచ్చారు.