వనపర్తి టౌన్/హుస్నాబాద్/శివ్వంపేట, వెలుగు: తెలంగాణలో ఏడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ‘శక్తి’ పరిధిలో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వనపర్తిలోని శివాజీ చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పాలమూరు విభాగ్ కన్వీనర్ అర్జున్ సాతర్ల మాట్లాడుతూ ఐటీఐలు, ఏటీఐలు, లేబర్ డిపార్ట్మెంట్, పాలిటెక్నిక్ కాలేజీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి 'శక్తి' పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
హుస్నాబాద్లో ఉద్రిక్తత
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పాలిటెక్నిక్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించగా, పోలీస్ వాహనానికి అడ్డంగా ధర్నా చేపట్టారు. చివరకు నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించి, విద్యార్థులకు సర్ది చెప్పడంతో వారు కాలేజీకి తిరుగుపయనమయ్యారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధి గోమారంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు చిన్న గొట్టిముక్కుల, మనోహరాబాద్, చండి వద్ద రాస్తారోకో చేశారు. రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింప చేశారు.
