మునుగోడులో ముగిసిన ప్రచారం

మునుగోడులో ముగిసిన ప్రచారం

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన ప్రచార ఘట్టం ముగిసింది. ఇవాళ  చివరిరోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం చేశాయి. ప్రచారం ముగియడంతో ఈసీ నిబంధనల ప్రకారం  ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన వారంతా నియోజకవర్గం నుంచి బయటికి వెళ్లిపోయారు. 

నవంబర్ 3న ఉదయం  ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. మునుగోడు బై పోల్ బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులున్నారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్  నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు.  నవంబర్ 6న ఫలితాలు వెలువడనున్నాయి.  

ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ జరిగే 48 గంటలకు ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ ముగిశాక ఈసీ కోడ్ ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ తరువాత యధావిధిగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు.

2లక్షల 41వేల 855 మంది ఓటర్లు

 మునుగోడు పరిధిలో 2లక్షల 41వేల 855 మంది ఓటర్లున్నారు. ఇందులో 50 మంది సర్వీస్ ఓటర్లు, 5 వేల 685 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి.పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఇప్పటివరకు 739 మంది ధరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.  అక్కడ మూడంచెల భద్రత అరెంజ్ చేశారు. ఎన్నికల రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 వేల 366 పోలీస్ సిబ్బందితో పాటు.. 15 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

బల్క్ ఎస్సెమ్మెస్ లు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఈవో వికాస్ రాజ్.  సోషల్ మీడియా ప్రచారంపై నిషేధం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఓటర్ స్లిప్పులను పంపిణీ పూర్తయింది. ఆన్ లైన్ లోనూ  ఓటర్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. మొదటిసారి కొత్త నమూనా ఓటర్ కార్డులను పంపిణీ చేశారు.