న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా ఇవాళ పంజాబ్ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు, ఉత్తర్ ప్రదేశ్ లోని 59 స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ఆరంభానికి ముందే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. యూపీలో 11 గంటల వరకు 21.18 శాతం పోలింగ్ నమోదైంది. ప్రముఖులు ఒక్కరికిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జస్వంత్ నగర్ లో ఓటు వేశారు. ఈసారి తామే అధికారంలోకి వస్తామన్నారు అఖిలేష్ యాదవ్. యూపీ రైతులు బీజేపీని క్షమించరని అన్నారు. రెండో విడతల్లోనే సెంచరీ కొట్టామన్నారు ఎస్పీ చీఫ్. కర్హల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు అఖిలేష్ యాదవ్. ములాయం సింగ్ యాదవ్ వీల్ చైర్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అఖిలేశ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ జశ్వంత్ నగర్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. 59 స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.15 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. ఫరూఖాబాద్ జిల్లాలోని 38 వ EVM లో తమ గుర్తు కనిపించటం లేదని సమాజ్ వాదీ పార్టీ ట్వీట్ చేసింది. ఈసీ ఈ విషయాన్ని గుర్తించాలని కోరింది.
పంజాబ్ లో 117 స్థానాల్లో 1304 మంది పోటీ
పంజాబ్ రాష్ట్రంలోనూ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు పంజాబ్ లో 17.77 శాతం పోలింగ్ నమోదైంది. మోగాలో పూర్తిగా మహిళ సిబ్బందితో పింక్ పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. పంజాబ్ లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 117 స్థానాల్లో 1304 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.14 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, సిధ్దూ, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డేరా బాబా నానక్ పోలింగ్ బూత్ లో పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్ జిందర్ సింగ్ ఓటు వేశారు. ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు భగవంత్ మాన్. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లుథియానాలో ఓటు వేశారు. పంజాబ్ లో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అభివృద్ది చేసే వారికే ఓటు వేయాలన్నారు.