- ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మంజూరు
- మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
- తాజాగా ఇరిగేషన్ ల్యాండ్ ఫిషరీస్కు కేటాయిస్తూ జీవో జారీ
- రాష్ట్రంలోనే మొదటి ఆక్వా పార్క్ ఏర్పాటుతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటు కానుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద రాష్ట్రానికి మంజూరైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తూ స్టేట్ క్యాబినెట్ ఇటీవల ఆమోదించింది. దీనికి అవసరమైన 85.10 ఎకరాల ఇరిగేషన్ ల్యాండ్ను ఫిషరీస్ డిపార్ట్మెంట్కు కేటాయిస్తూ గత నెల 28న ప్రభుత్వం జీవో నంబర్ 183 జారీ చేసింది. దాదాపు రూ.100 కోట్లతో ఆక్వా పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. ఇందులో కేంద్రం వాటా 60 శాతం కాగా, మిగతా 40 శాతంరాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. డీపీఆర్ పూర్తయిన వెంటనే టెండర్లు నిర్వహించి సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోనే మొదటి ఆక్వా పార్క్
ఇంటిగ్రేడెట్ ఆక్వా పార్క్ను ఆధునిక పద్ధతుల్లో నిర్మించనున్నారు. ఇది రాష్ట్రంలోనే మొదటిది కావడం విశేషం. ఇందులో చేపల విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ తో పాటు వివిధ రకాల చేపల ప్రదర్శనకు మ్యూజియం, ఆక్వా రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించడం కోసం ట్రైనింగ్ సెంటర్, మత్స్య సేవా కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉత్పత్తయ్యే సీడ్ను రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సప్లై చేయనున్నట్లు సమాచారం. అలాగే టూరిజం డెవలప్మెంట్లో భాగంగా వివిధ రకాల చేపల ప్రదర్శనకు మ్యూజియం, వాటర్ గేమ్స్, కెఫెటేరియా నిర్మించనున్నారు. ఆక్వా పార్క్ ఏర్పాటుతో ఇటు మత్స్య సంపద అభివృద్ధితో పాటు టూరిస్టులను ఆకర్షించేలా తీర్చిదిద్దనున్నారు.
45 ఎకరాల్లో ముర్రెల్ క్లస్టర్
ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్లో భాగంగా దాదాపు 45 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ముర్రెల్(కొర్రమీను) క్లస్టర్ ఏర్పాటు కానుంది. బొమ్మచేప, కొర్రమట్టగా పిలిచే ముర్రెల్ను రాష్ట్ర చేపగా ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. చేపల్లో వీటిది ప్రత్యేక స్థానం. ఇవి చాలా రుచికరంగా ఉండడంతో డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ముర్రెల్ క్లస్టర్ ఏర్పాటుతో ఈ కొరత తీరడంతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే స్థాయిలో వీటి ఉత్పత్తి జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్లో సుమారు వంద మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. ఇందులో మత్స్య సహకార సంఘాలు, మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
మత్స్య సంపద అభివృద్ధి
ఆక్వా పార్క్ ఏర్పాటుతో మత్స్య సంపద ఉత్పత్తి, అభివృద్ధిలో జిల్లాకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేపల పెంపకం ద్వారా వందల మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. ఏటా వానాకాలంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేప విత్తనం పోస్తున్నారు. ముఖ్యంగా రాహు, బంగారుతీగ, ముర్రెల్తో పాటు రొయ్యలను హైదరాబాద్, నాగపూర్ సహా వెస్ట్బెంగాల్కు ఎక్స్ పోర్ట్ చేస్తున్నారు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో ఈసారి వాటిలో సీడ్ వేయలేదు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్, ముర్రెల్ క్లస్టర్ ఏర్పాటుతో రానున్న రోజుల్లో జిల్లాలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరగడమే కాకుండా రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
